BRS Public Meeting | వరంగల్, ఆగస్టు 16 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): భూనబోంతరాలు దద్దరిల్లేలా మరో శంఖారావానికి బీఆర్ఎస్ అధినేత సిద్ధమవుతున్నారు. పల్లె, పట్నం, వీధి, వాడ, గూడెం, గుడిసె.. ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి అభివృద్ధి సంబురాలను చేరుస్తున్న గులాబీ శ్రేణులు.. పిల్లకాలువలన్నీ కలిసి మహానదిగా ఒక్కటై పోటెత్తినట్టు, ఉరువడిని అందుకోనున్నాయి. ఎన్నికల సంరంభాన్ని శిఖరస్థాయికి తీసుకెళ్లి చారిత్రక ఓరుగల్లు నుంచి సమర శంఖాన్ని పూరించేందుకు సీఎం కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారు. అక్టోబర్ 16న 10 లక్షల మందితో ఓరుగల్లులో బీఆర్ఎస్ భారీ బహిరంగసభ నిర్వహించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. సభ ఏర్పాట్లపై ఉమ్మడి వరంగల్ జిల్లా ముఖ్యనేతలకు సీఎం కేసీఆర్ సమాచారం ఇచ్చినట్టు తెలిసింది. రాష్ట్రంలో అన్ని పార్టీలకంటే ముందే, ఇప్పటికే బీఆర్ఎస్ ఎన్నికల సన్నాహాలు మొదలుపెట్టింది. పార్టీ నేతలు కేటీఆర్, కవిత, హరీశ్రావుతోపాటు ముఖ్య నేతలంతా తమతమ ప్రాంతాల్లో ప్రజల్లోకి వెళ్లి జోరుగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈ ప్రచార సంరంభాన్ని అత్యున్నతస్థాయికి తీసుకెళ్తూ అక్టోబర్ 16న వరంగల్లో నిర్వహించే భారీ బహిరంగ సభ ద్వారా ఎన్నికల ప్రచారాన్ని లాంఛనంగా ప్రారంభించనున్నట్టు సమాచారం. మలిదశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం నుంచి కేసీఆర్కు అచ్చొచ్చిన ఓరుగల్లు నుంచే వచ్చే ఎన్నికల కోసం ప్రచార శంఖారావం పూరించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
బీఆర్ఎస్ బహిరంగసభ అంటేనే దేశంలోని రాజకీయ పార్టీలన్నీ ఆసక్తిగా చూ స్తాయి. జనసమీకరణ, బహిరంగసభ నిర్వహణ, ఏర్పాట్లు… ఇలా అన్నింట్లోనూ ప్రత్యేకత ఉంటుంది. 150 ఎకరాల్లో బహిరంగసభ, 200 ఎకరాల్లో పార్కింగ్ ఉండేలా వరంగల్ నగర శివారులోని దేవన్నపేట ప్రాంతాన్ని ప్రాథమికంగా గుర్తించినట్టు తెలిసింది. అక్టోబర్లో 10 లక్షల మందితో వరంగల్లో భారీ బహిరంగసభ నిర్వహిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఏప్రిల్లో ప్రకటించారు. ఈ మేరకు సభ నిర్వహణకు ఏర్పాట్లు మొదలైనట్టు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ అక్టోబర్ తొలివారంలో వస్తుందని అంచ నా వేస్తున్నారు. ఈ ప్రక్రియకు ముందే అన్ని రకాలుగా ఎన్నికలకు సిద్ధమయ్యేలా బీఆర్ఎస్ అధిష్ఠానం ఏర్పా ట్లు చేసుకొంటున్నది. షెడ్యూల్ రాగానే భారీ సభ నిర్వహించాలని నిర్ణయించినట్టు తెలిసింది.
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు లక్ష్యంతో ఏర్పడిన టీఆర్ఎస్ ప్రస్థానంలో వరంగల్ కీలకంగా ఉంటున్నది. ఉద్యమ కార్యక్రమాలతోపాటు ఎన్నికల్లోనూ టీఆర్ఎస్కు ఉమ్మడి వరంగల్ జిల్లా అండగా నిలుస్తున్నది. తెలంగాణ సాధన కోసం టీఆర్ఎస్ అమలు చేసిన ముఖ్యమైన వ్యూహాలు వరంగల్ వేదికగానే జరిగాయి. రాష్ట్ర ఏర్పాటుతోపాటు సొంత రాష్ట్రంలో పరిపాలన నిర్ణయాలు వరంగల్ నుంచే మొదలయ్యాయి. కల్యాణలక్ష్మి, డబుల్ బెడ్రూం ఇండ్ల పథకాల అమలు, గుడుంబా నివారణ వంటి ఎన్నో కార్యక్రమాలను సీఎం కేసీఆర్ వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచే ప్రకటించారు. టీఆర్ఎస్ ఆవిర్భావం తర్వాత 2001 జూన్ 21న కాకతీయ డిగ్రీకాలేజీలో మొదటిసారి బహిరంగసభ జరిగింది. భారీ సంఖ్యలో జనం ఈ సభకు వచ్చారు. అప్పటి నుంచి టీఆర్ఎస్ ప్రతి కార్యక్రమం వరంగల్ నుంచే జరుగుతున్నది. టీఆర్ఎస్ బీఆర్ఎస్గా మారిన తర్వాత జరుగుతున్న అతిపెద్ద తొలి బహిరంగ సభ కావడంతో భారీ జనసమీకరణతో ఘనంగా నిర్వహించాలని నిర్ణ-యించినట్టు పార్టీ నేతలు చెప్పారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలో ఇక్కడ జరిగిన ప్రతి సభకు జనం బ్రహ్మరథం పట్టి ఆశీర్వదించారు. 2010 డిసెంబర్ 16న తెలంగాణ మహాగర్జన పేరుతో నగరంలోని ప్రకాశ్రెడ్డి పేటలో భారీ బహిరంగసభను నిర్వహించారు. సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఉద్యమ చరిత్రలోనే అతిపెద్ద బహిరంగసభగా ఇది రికార్డుకెక్కింది. 2017లో టీఆర్ఎస్ వార్షికోత్సవం సందర్భంగా పది లక్షల మందితో నిర్వహించిన ప్రగతి నివేదన సభ దేశవ్యాప్తంగా చర్చనీయాశమైంది. గత ఎన్నికల్లో అత్యధిక స్థానాలతో పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇప్పుడూ వరంగల్ బహిరంగసభతో గత రెండు ఎన్నికల ఫలితాలే పునరావృతం అవుతాయనే అంచనాలు ఉన్నాయి.