సిద్దిపేట, ఏప్రిల్ 16( నమస్తే తెలంగాణ ప్రతినిధి) : ఈ పార్లమెంట్ ఎన్నికల్లో ఆరు గ్యారెంటీలే గడ్డపారలై కాంగ్రెస్ను బొందపెడతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్రావు ధ్వజమెత్తారు. నాలుగు నెలల్లోనే రాష్ట్రంలో వద్దురా నాయనా.. కాంగ్రెస్ పాలన అనే పరిస్థితి వచ్చిందని ఎద్దేవా చేశారు. సంగారెడ్డి జిల్లా చౌటకూరు మండలం సుల్తాన్పూర్ శివారులో మంగళవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన ప్రసంగించారు.
కేసీఆర్ పాలనలో 24 గంటలు కరెంట్ వస్తే.. కాంగ్రెస్ పాలనలో 14 గంటలు కూడా రావట్లేదని విమర్శించారు. కాంగ్రెస్ పాలనలో కేసీఆర్ కిట్ మాయమైందని.. ప్రభుత్వ దవాఖానలో మందులే లేవని మండిపడ్డారు. కాంగ్రెస్ రాగానే మిషన్ భగీరథ నీళ్లు.. వృద్ధులకు పెన్షన్ రావట్లేదని.. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు ఇస్తామని చెప్పి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారని ఎద్దేవాచేశారు. నాడు చేతులు మొక్కారని.. నేడు చేతులు ఎత్తేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను వీడియో రూపంలో ప్రజలకు చూపిస్తూ.. రూ.2 లక్షల రుణమాఫీ అయిందా.. కాలేదా.. అని అడిగారు. రుణమాఫీ అయినవాళ్లను కాంగ్రెస్కు, కాని వాళ్లను కారు గుర్తుకు ఓటు వేయాలని పిలుపునిచ్చారు. వడ్లకు బోనస్, రూ.4 వేల పింఛన్, నిరుద్యోగ భృతి, మహిళలకు రూ.2500, రైతుబంధుపై కూడా కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని వివరించారు. ప్రజలు కాంగ్రెస్కు ఓటు వేసేందుకు సిద్ధంగా లేరని, కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేయవద్దని..పెనం మీద నుంచి పొయ్యిలో పడే పరిస్థితి వస్తుందని హెచ్చరించారు.
బీజేపీ గెలిస్తే ఇంకా ఆగమైతమని, ఎప్పటికైనా బీఆర్ఎస్ పార్టీయే తెలంగాణకు శ్రీరామరక్ష అని నొక్కి చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన మంచి పనులు ప్రజలే చెబుతారని, పదేండ్లలో బీజేపీ చేసిన మంచి పని ఒక్కటైనా చెప్పగలరా ? అని ప్రశ్నించారు. బీజేపోళ్లకు చెప్పేందుకు పథకాలు లేకనే ఫొటోలు, క్యాలెండర్లు పంచుతున్నారని ఎద్దేవా చేశారు. జీఎస్టీ, పెట్రోల్, డీజీల్, గ్యాస్ ధరలు పెంచి.. బీజేపీ పేదల నడ్డి విరిచిందని ఆగ్రహం వ్యక్తంచేశారు.
రాష్ర్టానికి ఒక మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వలే.. అడుగడుగునా తెలంగాణకు అన్యాయం చేసిన బీజేపీకి ఒక్క ఓటూ వేయవద్దని పిలుపునిచ్చారు. వడ్లు కొనమంటే నూకలు బుక్కమని తెలంగాణ జాతిని అవమానించారని, బీజేపీ వారికి తెలంగాణ ప్రజలు నూకలు బుక్కిస్తారని హెచ్చరించారు. పేదల విషయంలో కాంగ్రెస్, బీజేపీలు దొందూ దొందే అని హరీశ్రావు స్పష్టం చేశారు.