జనగామ, డిసెంబర్ 5 (నమస్తే తెలంగాణ): గుండెపోటుతో హఠాన్మరణం చెందిన బీఆర్ఎస్ పార్టీ జనగామ జిల్లా అధ్యక్షుడు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్రెడ్డికి కుటుంబ సభ్యులు, బంధువులు, గులాబీ శ్రేణులు కన్నీటి వీడ్కోలు పలికారు. జనగామ జిల్లాలోని చిల్పూరు మండలం రాజవరంలో మంగళవారం సంపత్రెడ్డి భౌతికకాయానికి అంత్యక్రియలు నిర్వహించగా, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హాజరయ్యారు. హైదరాబాద్ నుంచి రోడ్డుమార్గంలో రాజవరానికి చేరుకొన్న కేటీఆర్.. సంపత్రెడ్డి భౌతికకాయంపై పూలమాల వేసి, నివాళులర్పించారు. పాగాల కుటుంబసభ్యులను పరామర్శించి, ఓదార్చారు. సంపత్రెడ్డి మృతి చెందిన విషయం తెలియగానే రాజవరం చేరుకొన్న జనగామ, స్టేషన్ఘన్పూర్ ఎమ్మెల్యేలు పల్లా రాజేశ్వర్రెడ్డి, కడియం శ్రీహరి సోమవారం నుంచి మొదలుకొని మంగళవారం పాగాల అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అన్ని ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షించారు.
సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు సంపత్రెడ్డి అంత్యక్రియల్లో ఎలాంటి లోటుపాట్లు జరుగకుండా చూసుకున్నారు. ఎంపీ పసునూరి దయాకర్, ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్రెడ్డి, బండా ప్రకాశ్, తక్కళ్లపల్లి రవీందర్రావు, సత్యవతిరాథోడ్, మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు, మాజీ ఎమ్మెల్యేలు ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, డాక్టర్ టీ రాజయ్య, గండ్ర వెంకటరమణారెడ్డి, ఉమ్మడి జిల్లా జడ్పీ చైర్మన్లు, జడ్పీటీసీలు, ఎంపీపీలతోపాటు ఇతర బీఆర్ఎస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు అంత్యక్రియల్లో పాల్గొన్నారు. రాజవరంలోని ఇంటి నుంచి వ్యవసాయ క్షేత్రం వరకు సాగిన అంతిమయాత్రలో పల్లా, కడియంసహా ఉమ్మడి వరంగల్ జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు, నాయకులు, అభిమానులు, స్నేహితులు అధిక సంఖ్యలో పాల్గొని, పార్టీ సహచరుడికి తుది వీడ్కోలు పలికారు.
నేడు పార్టీ కార్యాలయాల్లో నివాళి: కేటీఆర్
బీఆర్ఎస్ వ్యవస్థాపక సభ్యుల్లో ఒకరైన పాగాల సంపత్రెడ్డి హఠాన్మరణం బాధాకరం అని కేటీఆర్ పేర్కొన్నారు. 14 ఏండ్లు కేసీఆర్ వెంట సైనికుడిలా పని చేశారని, ఆయన మరణం కార్యకర్తలను కలిచివేసిందని చెప్పారు. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా సంపత్రెడ్డి క్రియాశీలకంగా పని చేశారని, పార్టీ ఏ కార్యక్రమం ఇచ్చినా నిబద్ధతతో పనిచేస్తూ విజయవం తం చేశారని గుర్తుచేశారు. సంపత్ కుటుంబానికి కేసీఆర్, పార్టీ శ్రేణుల తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మరణం పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అం డగా ఉంటామని భరోసా ఇచ్చారు. సంపత్కుమార్తె చదువు బాధ్యతసహా ఆర్థిక ఇబ్బందులను సైతం పార్టీ తీరుస్తుందని చెప్పారు. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల జడ్పీ చైర్మన్లు, జిల్లా అధ్యక్షులు పార్టీ కార్యాలయాల్లో ఘనంగా నివాళులు అర్పించాలని పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు.