హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై (Danam Nagender) అనర్హత వేటు వేయాలని స్పీకర్ ప్రసాద్ కుమార్ను బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్యేలు కోరనున్నారు. ఉదయం 11 గంటలకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం హైదరాబాద్ హైదర్గూడలోని స్పీకర్ నివాసానికి వెళ్లనుంది. ఈ సందర్భంగా దానంపై అనర్హత పిటిషన్ను స్పీకర్కు అందజేయనున్నది.
కాగా, ఆదివారం ఇదే విషయమై స్పీకర్ను కలిసేందుకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేసిన ప్రయత్నం ఫలించని విషయం తెలిసిందే. దానంపై అనర్హత వేటు వేయాలనే పిటిషన్ను సమర్పించేందుకు బీఆర్ఎస్ ఎమ్యెల్యేల బృందం స్పీకర్ను కలిసేందుకు అపాయింట్మెంట్ కోరింది. సాయంత్రం 6 గంటలకు కలిసేందుకు బీఆర్ఎస్ బృందానికి స్పీకర్ సమయం ఇచ్చారు. దీంతో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్రెడ్డి, మాగంటి గోపీనాథ్, కాలేరు వెంకటేశ్, ముఠా గోపాల్, బంగారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యేల నివాస సముదాయంలోని స్పీకర్ నివాసానికి నిర్దేశిత సమయానికి వెళ్లారు.
అయితే, స్పీకర్ ఇంట్లో లేకపోవడంతో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 8.30 వరకు అక్కడే నిరీక్షించారు. తాము ఎదురుచూస్తున్నామని పలుమార్లు ఫోన్ చేసినా స్వీకర్ స్పందించలేదని ఎమ్మెల్యేలు పేర్కొన్నారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యేలు వెనుదిరిగారు. ఈ సందర్భంగా స్పీకర్ ముందు అపాయింట్మెంట్ ఇచ్చి కలవకపోవడం బాధాకరమని పాడి కౌశిక్రెడ్డి పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఒత్తిడితోనే స్పీకర్ తమను కలవలేదని ఆరోపించారు.