Opposition Leader | హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): ఎన్నో దశాబ్దాలుగా అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష నేతకు కేటాయిస్తున్న గదికి బదులుగా కేసీఆర్కు ఇప్పుడు మరో ఇరుకు గది కేటాయించడం వివాదస్పదమైంది. తరతరాలుగా ఇన్నర్ లాబీలకు ఆనుకొని ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత గదిని పూర్తిగా మూసివేసి, దానిని స్పీకర్ కార్యాలయానికి కేటాయించారు. అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. గత సంప్రదాయాల ప్రకారం ప్రధాన ప్రతిపక్ష నేతగా ఉన్న కేసీఆర్కు ఇన్నర్ లాబీలకు పక్కనే ఉన్న ప్రధాన ప్రతిపక్ష నేత గదిని కేటాయించాల్సి ఉంటుంది. కానీ, ఇప్పుడు ప్రధాన ప్రతిపక్ష నేతకు చిన్నగదిని సాధారణ లాబీల్లో కేటాయించారు. సాధారణంగా ప్రతిపక్ష నేత కార్యాలయం, ఆయన గది దాదాపు ముఖ్యమంత్రి కార్యాలయం, గదికి సరిసమానంగా ఉంటాయి.
ఎన్టీఆర్, చంద్రబాబునాయుడు, వైఎస్ రాజశేఖర్రెడ్డి, కే జానారెడ్డి ప్రతిపక్ష నేతలుగా ఉన్నపుడు దీనినే ఉపయోగించారు. ఈసారి కేసీఆర్కు ఆ గది కాకుండా ఇంకో చిన్న గదిని కేటాయించడంపై విమర్శలొస్తున్నాయి. తమ నేతకు ఎలాంటి సౌకర్యాలు లేని చిన్నగదిని కేటాయించడంపై బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. వారు ఇదే విషయాన్ని స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రధాన ప్రతిపక్ష నేతకు కేటాయించిన కార్యాలయం, గది ఏమాత్రం బాగోలేవని, ఇదేం పద్ధతంటూ ఆవేదన వ్యక్తంచేశారు. దీనిని తమ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఎమ్మెల్యేలందరూ స్పీకర్ వద్దకు వెళ్లి గురువారం ఉదయం చెప్పారు. తమ పార్టీకి ఉన్న బలాన్ని దృష్టిలో పెట్టుకొని మంచిగా ఉన్న గదులను కేటాయించాలని కోరారు.
అసెంబ్లీలోని మీడియా లాంజ్కు సైతం తాళం వేశారు. గతంలో ఇక్కడి లాబీల్లో విశేషాలను కవర్ చేసే రిపోర్టర్లు కూర్చునేందుకు ప్రత్యేక ఏర్పాట్లు ఉండేవి. ఒక టీవీ, మంచినీళ్లు వంటి సౌకర్యాలు ఉండేవి. బడ్జెట్ సమావేశాల ప్రారంభమైన తొలిరోజే మీడియా లాంజ్కు తాళం వేయడంతో మీడియా ప్రతినిధులు అక్కడ నిలబడే ఉండాల్సి వచ్చింది. గతంలో శాసనసభలో ముఖ్యమంత్రి కార్యాలయం వద్ద ఉండే లాబీల వరకు మీడియా ప్రతినిధులను అనుమతించేవారు. కానీ, గురువారం ఆఫీసర్ల లాంజ్కు ఎదురుగా, లిఫ్టుల పక్కన ఉన్న అద్దాల తలుపులను మూసివేశారు. ఎందుకు మూసివేశారన్నదానిపై స్పష్టత లేదు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అటునుంచి రాకపోకలు సాగిస్తారని, మీడియాకు అనుమతి లేదని అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యురిటీ సిబ్బంది చెప్పారు.
గవర్నర్ ప్రసంగం సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆందోళనలకు దిగుతారేమోనన్న అనుమానంతో శాసనసభ లాబీల్లో భారీగా పోలీసు మార్షల్స్ను మోహరించారు. గవర్నర్ ప్రసంగించే వరకు మార్షల్స్ ఇన్నర్ లాబీల్లోనే ఉన్నారు. గవర్నర్ ప్రసంగం ముగిసి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సభాప్రాంగణం నుంచి వెళ్లిపోయే మార్షల్స్ లోపలే ఉండటం గమనార్హం.