హైదరాబాద్, ఏప్రిల్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని కొందరు పోలీసులు మంత్రులు, ఎమ్మెల్యేల అడుగులకు మడగులొత్తుతూ వారి మెప్పుకోసం పనిచేస్తూ, బీఆర్ఎస్ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని, అరెస్టులంటూ భయభ్రాంతులకు గురిచేస్తున్నారంటూ బీఆర్ఎస్ నేతలు బుధవారం డీజీపీకి ఫిర్యాదుచేశారు. ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్, బీఆర్ఎస్వీ అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్యాదవ్, పార్టీ నాయకులు గట్టు రాంచందర్రావు డీజీపీని కలిసి వినతిపత్రం అందించారు. పోలీసులను అడ్డంపెట్టుకుని బీఆర్ఎస్ను ఇబ్బంది పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని వినతిపత్రంలో వారు పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలను విమర్శిస్తే సహించలేకపోతున్నదని దుయ్యబట్టారు. ప్రభుత్వాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టిన వారిపై పోలీసులు అత్యుత్సాహంతో కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. బైండోవర్లు, కేసులు, బెదిరింపులకు పాల్పడుతూ బీఆర్ఎస్ కార్యకర్తల మనోధైర్యాన్ని దెబ్బతీసేలా వ్యవహరిస్తున్నారని తెలిపారు. సోషల్ మీడియాలో పోస్టులు పెట్టాడంటూ కరీంనగర్కు చెందిన తమ పార్టీ నాయకుడు, ఉద్యమకారుడు సల్వాజీ మాధవరావుపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి మానసికంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. అధికార పార్టీ నేతలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరించడం దురదృష్టకరమని పేర్కొన్నారు. మాధవరావుపై పెట్టిన కేసులు ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తలపై పెడుతున్న కేసులపై విచారణ జరిపించాలని కోరారు. పోలీసులను మందలించి ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలని వినతిపత్రంలో నేతలు పేర్కొన్నారు.