KCR | హైదరాబాద్ : బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. చేవెళ్ల ప్రజా ఆశీర్వాద సభకు బయల్దేరారు. మరికాసేపట్లో సభా ప్రాంగణానికి చేరుకోనున్నారు. చేవెళ్లలోని ఫరా ఇంజినీరింగ్ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్న ఈ బహిరంగ సభకు రైతులు, జనాలు తండోపతండాలుగా తరలివస్తున్నారు. జై తెలంగాణ.. జై కేసీఆర్ నినాదాలతో సభా ప్రాంగణం మార్మోగిపోతోంది.
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ చేవెళ్ల వేదికగా ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్నారు. ఈ సభ ద్వారా కేసీఆర్ పార్టీ శ్రేణుల్లో సమరోత్సాహాన్ని నింపనున్నారు. ప్రధాన కూడళ్లు, రహదారుల వెంట గులాబీ ఫ్లెక్సీలు, జెండాలతోపాటు ప్రజలు దూరం నుంచి సభను చూసేందుకు ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేశారు. మరికాసేపట్లో సభ ప్రారంభం కానుంది.
లోక్సభ ఎన్నికల షెడ్యూల్కు ముందు నుంచే.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఫల్యాలను ఎండగడుతూ.. గులాబీ దళాన్ని ఎన్నికలకు సన్నద్ధం చేసేలా బీఆర్ఎస్ పార్టీ కసరత్తును ప్రారంభించింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితో నైరాశ్యంలో ఉన్న పార్టీ క్యాడర్లో జోష్ నింపేలా.. రానున్న లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పార్టీ అగ్రనేతలు ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తున్నారు. ఈ ఏడాది జనవరిలోనే బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీశ్రావు చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా సన్నాహక సమావేశాలను నిర్వహించారు. చేవెళ్లతోపాటు మహబూబ్నగర్, నాగర్కర్నూలు, భువనగిరి, మల్కాజిగిరి పార్లమెంటు స్థానాలతో రంగారెడ్డి జిల్లాకు ఉన్న అనుబంధంతో కేసీఆర్ ఉమ్మడి రంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక ఫోకస్ పెట్టారు.