KCR : దేవుడి గుళ్లకాడ ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు తప్ప ముఖ్యమంత్రికి వేరే ఏం పనిలేదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా బస్సు యాత్ర చేస్తున్న కేసీఆర్.. ఇవాళ నిజామాబాద్లో రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా నెహ్రూ పార్క్ చౌరస్తాలో జరిగిన కార్నర్ మీటింగ్లో ఆయన ప్రసంగించారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా నెరవేర్చడం లేదని విమర్శించారు. కాంగ్రెస్ సర్కారు మెడలు వంచాలంటే బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ఓటర్లను కోరారు.
‘కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో గెలిస్తే రాష్ట్రంలో మహిళలందరికీ రూ.2,500 చొప్పున ఇస్తమన్నరు. మరె రూ.2,500 వచ్చినయా..? రాలేదా..? నిజామాబాదోళ్లకు వచ్చినయటగా..? రాలేదా..? మరె రావాల్నంటె ఏంజెయ్యాలె..? పిడికిలి బిగించాలె. పోరాటం జెయ్యాలె. మెడలు వంచాలె. కరెంటు సక్కగ రావాలన్నా, వాళ్లిచ్చిన హామీలు నెరవేరాలన్నా, ఇయ్యాల దెబ్బకు భయపడి రైతుబంధు ఏసినట్లుగా.. వాళ్లిచ్చిన గ్యారంటీలన్నింటిని అమలు చేయాలన్నా బీఆర్ఎస్ గెలువాలె. ఓ ముఖ్యమైన మాట.. ఎనకటికి ఒగాయన చెప్పిండాట. ‘రేపు మా ఇంట్ల లడ్డూల భోజనం’ అని. ఎప్పుడు జూసిన గదే ఉంటది. ఎన్నడుపోయినా రేపు అనే ఉంటది. ఇప్పుడు ఏం జెప్తున్నడు ముఖ్యమంత్రి..? కేసీఆర్ లక్ష రూపాయల రుణం మాఫీ జేసిండుగా.. ఇగ మేం రూ.2 లక్షల రుణం మాఫీ చేస్తం అని చెప్తున్నడు. డిసెంబర్ 9 నాడే మాఫీ చేస్తం అన్నడు. మరె మాఫీ అయ్యిందా..? రేపు రూ.2 లక్షల రుణమాఫీని కక్కించేదాకా బీఆర్ఎస్ కొట్లాడాలె. బీఆర్ఎస్ కొట్లాడాలె అంటే నిజామాబాద్లో బాజీరెడ్డి గోవర్దన్రెడ్డి గెలువాలె’ అని కేసీఆర్ అన్నారు.
‘ముఖ్యమంత్రి ఏడికిపోతే ఆడ ఒట్లు పెడుతున్నడు. బాసరకు పోయి సరస్వతి అమ్మవారి మీద ఒట్టువెట్టిండు. యాదాద్రికి వొయ్యి ఒట్టు వెట్టిండు. ఆయనకు వేరే ఏం పనిలేదు. దేవుడి గుళ్లకాడ ఒట్లు, కేసీఆర్ మీద తిట్లు. ఇదే జరుగుతుంది. మీ అందరికి నేను ఒక్కటే మనవి చేస్తున్నా. నేను ప్రాణాలకు తెగించి తెలంగాణ తెచ్చిన. తెచ్చిన తెలంగాణను ఒక పొదరిల్లులాగా బ్రహ్మండంగా అభివృద్ధి చేసిన. అన్ని వర్గాలను ఆదుకున్నం. నిజామాబాద్లో బీడీ కార్మికులు ఎక్కువగా ఉంటరు. 60 ఏళ్ల కాంగ్రెస్ పాలనలో, టీడీపీ హయాంలో ఎవడన్నా ఏకాణ ఇచ్చిండా బీడీ కార్మికులకు..? ఎవ్వలు గూడా ఇయ్యలే. బీడీ కార్మికులకు రూ.2 వేలు పెన్షన్ ఇచ్చి ఆదుకున్నం. బీడీ కార్మికులను కాపాడినం. వాళ్ల టేకాదార్లకు కావాలంటే కూడా ఇచ్చినం. బీడీ కార్మికులంతా ఇయ్యాలా బీఆర్ఎస్కు అండగా నిలబడాలె. మీ నీతి నిజాయితీ చూపించి బీఆర్ఎస్ను దీవించాలె’ అని కోరారు.
‘నరేంద్రమోదీ బీడీ కార్మికులకు ఏమన్నా ఇచ్చిండా. బీడీ కార్మికులకు ఒక్క తెలంగాణలనే పెన్షన్ ఇస్తరు. దేశంలో మరే రాష్ట్రంలో ఇయ్యరు. కాబట్టి మీ అందరికి మనవి చేస్తున్నా. ఈ బీజేపీ, కాంగ్రెస్ చెప్పేదంతా ట్రాష్. వట్టిదే. కాబట్టి మనం ముందుకు పోవాలె.. మన నీళ్లు కాపాడుకోవాలె.. మన బతుకులు కాపాడుకోవాలె.. తెచ్చుకున్న రాష్ట్రాన్ని ఇంకింత తెలివికి తెచ్చుకోవాలె.. కరెంటు కోతలు పోవాలె.. చదువుకునే పిల్లలకు న్యాయం జరగాలె.. ఇయ్యన్నీ జరగాలంటే బీఆర్ఎస్ పార్టీ గెలువాలె’ అని బీఆర్ఎస్ అధినేత అన్నారు.