KCR : కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదారునెలల్లోనే తెలంగాణలో కరెంటు కోతలు మొదలైనయని, ఈ కరెంటు కోతలు రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరమని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కరెంటు చాలా ముఖ్యమని అన్నారు. పిండిగిర్నీ నడిపే వ్యక్తి నుంచి హెలికాప్టర్లు తయారు చేసే కంపెనీ వరకు కరెంటు కోతలతో తీవ్రంగా ప్రభావితమవుతాయని చెప్పారు.
‘ఒక అభివృద్ధి చెందుతున్న దేశంలో అభివృద్ధి చెందుతున్న రాష్ట్రానికి కరెంటు అనేది చాలా ముఖ్యం. పిండి గిర్ని నడుపుకునే వ్యక్తి నుంచి అపాచీ హెలికాప్టర్లు తయారు చేసే భారీ కంపెనీల వరకు కరెంటు కోతలు తీవ్రంగా ప్రభావితం చేస్తాయి. పరిశ్రమలు నడిపేవాళ్లు ధైర్యం కోల్పోతారు. అది చాలా తీవ్ర పరిణామం. వ్యవసాయం చేసే రైతు నుంచి అమెజాన్ లాంటి ఐటీ కంపెనీల వరకు కూడా కరెంటు కొరత దెబ్బతీస్తది. అది ప్రమాదకరం. రాష్ట్ర భవిష్యత్తుకే ఇబ్బంది కలుగుతుంది’ అని కేసీఆర్ అన్నారు.
‘కరెంటును ఎందుకు దెబ్బతీసిండ్రో నాకు అర్థం కావడంలేదు. ఏం కొరత లేదు. సింగరేణి మనది. బొగ్గు కొరత లేదు, నీళ్ల కొరత లేదు. మనుషుల కొరత లేదు. అదే ఉద్యోగస్తులు. ఎందుకు నడపలేదు కరెంటును..? ఏం సమాధానం చెప్తరు ప్రజలకు. అదే ఆగ్రహం ఉంది ప్రజల్లో. నేనదే ప్రశ్న అడిగిన నా ప్రసంగాల్లో. కేసీఆర్ పక్కకు జరగంగనే కట్కా బంద్ చేసినట్టే కరెంటు ఎక్కడికి పోయింది..? తొమ్మిదేళ్లు జరిగిందిగా.. ఇప్పుడు వీళ్లు కొత్తగా చేసేదేముంది..? ఉన్నదున్నట్టు నడిపిస్తే అయిపోయేది. వాళ్లు అతిచేశారు. అతికి పోయి ఈ పరిస్థితికి తెచ్చిండ్రు’ అని కేసీఆర్ విమర్శించారు.