KCR | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం విఫలమైన నేపథ్యంలో రాష్ట్ర రైతాంగ సంక్షేమం కోసం.. వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడం కోసం.. రాజీ లేని పోరాటాలు మరింత ఉదృతం చేయాలి అని బీఆర్ఎస్ అధినేత, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ సాగునీటి రంగాన్ని ఆగం చేసే దిశగా.. ఆంధ్రా ప్రభుత్వం నిర్మించనున్న బనకచర్ల ప్రాజెక్ట్ను ఎట్టిపరిస్థితుల్లోనూ నిలువరించాల్సిందే అని కేసీఆర్ తేల్చిచెప్పారు. అందుకు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులను క్షేత్ర స్థాయిలో పోరాటాల కోసం కార్యోన్ముఖులను చేయాలని పార్టీ శ్రేణులకు అధినేత కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
రాష్ట్ర రైతాంగ సంక్షేమం కాపాడడం… వ్యవసాయ సంక్షోభాన్ని నివారించడంతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పాలన వైఫల్యాలను ఎండగడుతూ తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడేందుకు పార్టీ తరఫున క్షేత్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణ మీద ఎర్రవెల్లి నివాసంలో అధినేత కేసీఆర్ సుదీర్ఘ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు పార్టీ సీనియర్ నేతలు హరీశ్ రావు, జగదీశ్ రెడ్డి పాల్గొన్నారు.
తెలంగాణ రైతుల ప్రయోజనాలను ఫణంగా పెట్టి ఆంధ్రా ప్రయోజనాలను కాపాడేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వమే పాలనా విధానాలను అమలు చేయడం దుర్మార్గం అని కేసీఆర్ మండిపడ్డారు. తమను నమ్మిన పాపానికి, తెలంగాణ రైతాంగానికి.. శాశ్వత అన్యాయం వడిగడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వ దుర్మార్గపు వైఖరిని తీవ్రంగా ఎండగట్టాలి. ఇక్కడ చంద్రబాబు.. అక్కడ మోదీల ప్రయోజనాలను కాపాడేందుకు రాష్ట్ర సీఎం తహతహ లాడుతుండడాన్ని తెలంగాణ సమాజం గమనిస్తున్నది. కాలేశ్వరం ప్రాజెక్టును ఉద్దేశపూర్వకంగా పండబెట్టి.. వానాకాలం నాట్లు అయిపోతున్నా కూడా.. ఇంతవరకు రైతాంగానికి సాగునీరు అందించని రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని ప్రజాక్షేత్రంలో నిలదీయాలి. కన్నేపల్లి పంప్ హౌస్ దగ్గర గోదావరి జలాలను ఎత్తిపోయాలి. పంపులను ఆన్ చేయాలి. చెరువులు, కుంటలు, రిజర్వాయర్లను నింపాలని కేసీఆర్ డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో యూరియా కొరత తీవ్రంగా ఉంది. రైతులు వరి నాట్లు వేసుకుంటున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని నిర్లక్ష్యం చేయడం క్షమించరాని నేరం దీని మీద పోరాటాలు చేయాలి. కాంగ్రెస్, బీజేపీ పరస్పరం ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకుంటూ కాలయాపన చేస్తూ రాష్ట్ర ప్రజల సమస్యలను గాలికి వదిలేస్తున్నారు. దీనిమీద బీఆర్ఎస్ పార్టీ గట్టిగా రెండు పార్టీలను నిలదీయాలి. ఇప్పటికే ప్రజా సమస్యల మీద పోరాడేందుకు బీఆర్ఎస్ విద్యార్థి విభాగాన్ని బలోపేతం చేస్తున్న దిశగా… మిగతా అన్ని అనుబంధ వ్యవస్థలను బలోపేతం చేసి వాళ్లను క్షేత్రస్థాయిలో పోరాటంలో ప్రజలతో మమేకం చేయాలని కేసీఆర్ సూచించారు.