హైదరాబాద్, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమానికి ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ అందించిన ప్రజాస్వామిక స్ఫూర్తి, చేసిన త్యాగం మరువలేనిది అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పేర్కొన్నారు. స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ తొలి తరం ఉద్యమకారుడు, గాంధేయవాది, ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి సందర్భంగా.. ఆయన కృషిని కేసీఆర్ శనివారం స్మరించుకున్నారు. బాపూజీతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ నివాళులు అర్పించారు. రేపటి తరాలు.. కొండా లక్ష్మణ్ బాపూజీ కృషిని, గొప్పతనాన్ని గుర్తించుకునే దిశగా, ఆయన పేరుతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర ఉద్యానవన విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేసిందని, జయంతి, వర్ధంతులను అధికారికంగా నిర్వహించే సంప్రదాయాన్ని నెలకొల్పింది అని కేసీఆర్ అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం బాపూజీ చేసిన కృషిని ఆదర్శంగా చేసుకుని, అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిందని తెలిపారు.