తెలంగాణ రాష్ట్ర సాధన కోసం భావజాల వ్యాప్తి కోసం తన జీవితాన్ని అర్పించిన సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్ధంతి (జూన్ 21) సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వారి త్యాగాలను కృషిని స్మరించుకున్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన చివరి దశ పోరాటంలో, ఉద్యమ రథ సారథిగా తనను ముందు నడుపుతూ ప్రొఫెసర్ జయశంకర్ అందించిన ప్రోత్సాహం జీవితంలో మరువలేనిదని కేసీఆర్ తెలిపారు.
తెలంగాణ సాధన కోసం అనుసరించాల్సిన పార్లమెంటరీ ప్రజాస్వామిక వ్యూహాలకు తన ఉద్యమ కార్యాచరణకు ప్రొఫెసర్ జయశంకర్ ఇచ్చిన సైద్ధాంతిక నైతిక మద్దతు మహోన్నతమైనదని కేసీఆర్ స్మరించుకున్నారు. పదేండ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ ప్రగతి పాలనలో ప్రొఫెసర్ జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉందని, నేటి రాష్ట్ర ప్రభుత్వం అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ తెలంగాణ ఆత్మ గౌరవాన్ని మరింతగా ఇనుమడింపజేసే దిశగా పాలన అందించిన నాడే మనం వారికి ఘన నివాళి అర్పించిన వారమవుతామని కేసీఆర్ స్పష్టం చేశారు.