హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ) : ఆర్థిక, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక తదితర రంగాల్లో అణగారిన వర్గాలకు సమానవాటా, సమన్యాయం దకేలా రాజ్యాంగాన్ని పొందుపరచడంలో అంబేద్కర్ కనబరిచిన దార్శనికత మహోన్నతమైనదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కొనియాడారు. బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి, రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బాబా సాహెబ్ అంబేదర్ వర్ధంతి సందర్భంగా దేశానికి ఆయన అందించిన సేవలను, అనితర సాధ్యమైన కృషిని కేసీఆర్ స్మరించుకున్నారు. దేశ స్వాతంత్య్రానంతర కాలంలో ప్రపంచానికే ఆదర్శవంతమైన స్వయంపాలన కోసం రాజ్యాంగాన్ని అందించారని గుర్తుచేశారు. దేశంలో రాష్ర్టాల ఏర్పాటు కోసం రాజ్యాంగంలో అంబేదర్ పొందుపరిచిన ఆర్టికల్ 3 తెలంగాణ ఏర్పాటుకు మార్గం చూపిందని తెలిపారు. అంబేద్కర్ విశేష కృషిని, వారు అందించిన స్ఫూర్తిని చాటేందుకు ప్రపంచంలోనే మహోన్నతమైన రీతిలో వారి స్ఫురద్రూపాన్ని తెలంగాణలో అత్యంత ఎత్తయిన విగ్రహంగా నిలుపుకొన్నామని వివరించారు.
దేశపాలనకు రాజ్యాంగం ద్వారా బాటలు వేసిన డాక్టర్ బీఆర్ అంబేదర్ ఘనమైన కీర్తిని చాటేందుకు దేశ చరిత్రలోనే మునుపెన్నడూ లేనివిధంగా తెలంగాణ పాలనా సౌధానికి ‘డాక్టర్ బీఆర్ అంబేదర్ తెలంగాణ స్టేట్ సెక్రటేరియట్’ అని పేరు పెట్టుకున్నామని కేసీఆర్ గుర్తుచేశారు. అంటరాని వర్గాలుగా తరతరాలుగా వివక్షకు గురవుతున్న దళిత సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం చేసి, వారి సామాజిక గౌరవం ఇనుమడింపజేసే దిశగా, అంబేదర్ స్ఫూర్తితోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం దళితబంధు పథకాన్ని అమలు చేసిందని తెలిపారు. దళితుల జీవితాల్లో వెలుగులు నింపే దిశగా దళితబంధు సత్ఫలితాలు సాధించిందని పేర్కొన్నారు. అదే స్ఫూర్తిని కొనసాగిస్తూ అన్ని రంగాల్లో వివక్షలేని సమ సమాజ నిర్మాణానికి అవసరమైన కృషి చేయడం ద్వారానే అంబేదర్కు ఘననివాళి అర్పించగలమని కేసీఆర్ స్పష్టంచేశారు.