KCR | హైదరాబాద్, ఫిబ్రవరి 5 (నమస్తే తెలంగాణ): కృష్ణా ప్రాజెక్టులను కృష్ణానదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ బీఆర్ఎస్ పార్టీ భారీ ఉద్యమం చేపట్టబోతున్నది. బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కే చంద్రశేఖర్రావు మంగళవారం తెలంగాణ భవన్కు రానున్నారు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం తొలిసారిగా తెలంగాణ భవన్కు వస్తున్న ఆయన, ప్రాజెక్టుల పరాధీనంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టనున్నట్టు తెలిసింది. కేఆర్ఎంబీపై కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యం, తెలంగాణ ప్రయోజనాల పట్ల ఆ పార్టీ చిత్తశుద్ధిని ప్రజల్లోకి తీసుకపోయే విధంగా ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. తెలంగాణ భవన్లో హైదరాబాద్, రంగారెడ్డి, నల్లగొండ, ఖమ్మం, మహబూబ్నగర్ జిల్లాలకు చెందిన ముఖ్య నేతలతో సమావేశం కానున్నారు.
ఈ ఐదు జిల్లాల్లోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ చైర్పర్సన్లు, డీసీసీబీ, మున్సిపల్ చైర్పర్సన్లు, ఎంపీపీలు, జడ్పీటీసీ సభ్యులు, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయి నేతలను కూడా సమావేశానికి ఆహ్వానించారు. ఈ సమావేశంలోనే కేసీఆర్ ఉద్యమ కార్యాచరణను ప్రకటించనున్నారు. ప్రధానంగా కేఆర్ఎంబీకి ప్రాజెక్టులను అప్పగిస్తే తెలంగాణకు జరిగే నష్టాలను వివరిస్తారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయంతో హైదరాబాద్ నగరానికి తాగునీటికి, నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య తీర్చేందుకు ఇస్తున్న తాగునీటికి కూడా ఇబ్బంది అవుతుందని వివరించనున్నారు. ఈ నెల రెండో వారంలో నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. బహిరంగ సభకు పెద్ద ఎత్తున రైతులను తరలించేలా పార్టీ నాయకులకు సూచనలు చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం తొలిసారి తెలంగాణ భవన్కు వస్తున్న కేసీఆర్కు ఘన స్వాగతం పలికేందుకు పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నాయి.