KCR | దళితబంధు ఏమైందని కాంగ్రెస్ నాయకులను నిలదీయాలని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజలకు పిలుపునిచ్చారు. చేవెళ్లలో జరిగిన బీఆర్ఎస్ బహిరంగ సభకు ఆయన హాజరయ్యారు. ఎంపీ అభ్యర్థి కాసాని జాన్ఞేశ్వర్ను ఎన్నికల్లో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘అంబేద్కర్, పూలే చూపించిన మార్గంలో 70 ఏండ్లలో లేనటువంటి 1100 గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేసి కాలేజీలు మార్చుకున్నాం. కులం మతంల ఏకుండా గగిరిజనులు, ముస్లింలు, బలహీన, దళిత వర్గాల కోసం ఏర్పాటు చేసుకున్నాం. బీసీ, దళిత, గిరిజన బిడ్డలు విదేశాల్లో చదువుకునేందుకు 20 లక్షల ఓవర్సీస్ స్కాలర్షిప్స్ ఇచ్చుకున్నాం. ఇవన్నీ ఇప్పుడు మాయం అయ్యాయి. ఒక్క బిడ్డకు కూడా ఓవర్సీస్ స్కాలర్షిప్ ఇవ్వడం లేదు. దళితవాడలు ధనిక వాడలు కావాలని.. దేశంలో ఎక్కడాలేని విప్లవాత్మక మార్పు తేవాలని సంవత్సరానికి లక్ష, రెండులక్షల కుటుంబాలు బాగు చేసుకుంటూ పోవాలని రూ.10లక్షలు ఇచ్చుకుంటూ దళితబంధు కార్యక్రమాన్ని తీసుకున్నాం’ అన్నారు.
‘ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారు చెప్పారు. కేసీఆర్ రూ.10లక్షల ఇస్తున్నడు. మా ప్రభుత్వం వస్తే రూ.12లక్షలు ఇస్తమని ఆనాడు మాయమాటలు చెప్పారు. 1.30లక్షల దళిత కుటుంబాలకు దళితబంధు పథకం వర్తింపజేశాం. ప్రొసిడింగ్స్ ఇచ్చి.. డబ్బులు కలెక్టర్లకు పంపాం. రూ.12లక్షల ఇస్తామని నమ్మబలికి ఈ కాంగ్రెస్ ఇవాళ చేసింది ? ఒక్కరి కూడా ఇవ్వడం లేదు. రూ.12లక్షలు కాదు.. రూ.10లక్షలు ఇవ్వలేదు. అకౌంట్లన్నీ ఫ్రీజ్ చేసి ప్రభుత్వం డబ్బులు వాపస్ తీసుకున్నది. దయచేసి దళిత సమాజంలో ఉండే మేధావులు, దళిత యువత తీవ్రంగా ఆలోచన చేయాలి.
మౌనంగా ఉంటే మన సమస్యలు పరిష్కారం కావు. నేను ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నా. 1.30లక్షల దళితబిడ్డలను నేనే స్వయంగా దళితబిడ్డలను తోడుకొని వచ్చి సెక్రటేరియట్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్ద దీక్షపట్టి మీ మెడలు వంచి అవన్నీ వారికి ఇప్పిస్తామని మనవి చేస్తున్నా. ఇవాళ దళితబిడ్డలకు మనవి చేస్తున్నా. మరో ఎలక్షన్ వచ్చింది. ఐదునెలలు గడిచింది కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు ఇచ్చి. మీ గ్రామాలు, మండలాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మీరు నిలదీయండి. ప్రజాస్వామ్యంలో మనకు హక్కు ఉన్నది. మా ప్రొసీడింగ్స్ను ఎందుకు రద్దు చేశారు? అవి ఎక్కడ పోయినయ్ అని అడగండి. మౌనం పాటిస్తే కాదు. సందర్భం వచ్చినప్పుడు స్పందించాలి. అడగాలి. నోరు తెరవాలి. పోరాటం చేయాలి. అప్పుడే సాధ్యమవుతుంది. దాని కోసం మీ ఎంపీ కాబోయే జాన్ఞేశ్వర్.. మొత్తం బీఆర్ఎస్ పార్టీ మీకు అండగా ఉంటుంది’ అన్నారు.