KCR | హైదరాబాద్, మే 9(నమస్తే తెలంగాణ): పార్లమెంటు ఎన్నికల తర్వాత ఈ ప్రభుత్వం ఉంటుందో, ఊడుతుందో, ఏమి జరుగుతుందో తెలియదని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అనుమానం వ్యక్తంచేశారు. యాదవ సోదరుల కోసం అప్పట్లో తాము గొర్రెల పంపిణీ, మత్స్యకారుల కోసం చేపపిల్లల పథకం తీసుకొస్తే ఇవేం స్కీములంటూ కాంగ్రెస్ వాళ్లు ఎగతాళి చేశారని గుర్తుచేశారు.
గురువారం కరీంనగర్లో నిర్వహించిన రోడ్షోలో కేసీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక యాదవులకు రూ. 2 లక్షలు ఇస్తామని చెప్పి గొర్రెల పథకాన్ని బంద్ చేశారని మండిపడ్డారు. ఒక్క హుజూరాబాద్లోనే దళితబంధు పథకాన్ని 20 వేల కుటుంబాలకు ఇచ్చినట్టు గుర్తుచేశారు. కాంగ్రెస్ నేతలు దళితబంధును రూ.12 లక్షలకు పెంచి ఇస్తామని ఒక్కరికీ ఇవ్వకుండా మోసం చేశారని ఆగ్రహం వ్యక్తంచేశారు.
ఉద్యోగులకు తక్షణమే డీఏలు ఇస్తామని చెప్పి ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, ఉద్యోగులను, విద్యార్థులను, రైతులను, యాదవులను, మత్య్సకారులను, దళితులను ఇలా అన్ని వర్గాలను కాంగ్రెస్ మోసం చేసిందని దుయ్యబట్టారు. కొత్త మెడికల్ కాలేజీలకు పర్మిషన్లు కూడా తీసుకోవడం లేదని తెలిపారు.
కరీంనగర్ నన్ను గుండెల్లో పెట్టుకున్నది
‘నేను తెలంగాణ కోసం గులాబీజెండా ఎత్తిన్నాడు ఇదే గడ్డపై ఉన్న ఎస్ఆర్ఆర్ కాలేజీ నుంచే ‘జై తెలంగాణ’ నినాదం ఇచ్చిన. కరీంనగర్ ఇచ్చిన స్ఫూర్తితో ఆ నినాదం, ఆ జెండా ఆకాశమంత ఎత్తుకు ఎగిరింది. కరీంనగర్ దీవెనతోనే నేను తెలంగాణ రాష్ట్రం సాధించిన. ఒకనాడు కాంగ్రెస్ వాళ్లు ‘మావల్లనే నువ్వు గెలిచావు’ అని నన్ను అవమానిస్తే, నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరుషం చూపించాలని పదవికి రాజీనామా చేసిన. ఉప ఎన్నికల్లో రెండున్నర లక్షల మెజార్టీతో గెలిపించి నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్. ఉద్యమంలో కరీంనగర్ జిల్లా పాత్ర ఎన్నిటికీ మర్చిపోలేనిది. ఆ గౌరవం నాకు ఉంది’ అని కేసీఆర్ పేర్కొన్నారు.
కరీంనగర్ ప్రజలకు అదనంగా రూ.15 లక్షలు!
విదేశాల్లోని నల్లడబ్బును తీసుకొచ్చి ప్రతి ఇంటికి రూ. 15 లక్షలు ఇస్తానని మోదీ హామీ ఇచ్చారని, కరీంనగర్లో మాత్రం బండి సంజయ్ గెలిచారు కాబట్టి మరో రూ.15 లక్షలు కలిపి రూ. 30 లక్షలు ఇచ్చారట కదా? అని ఎద్దేవా చేశారు. రూ.15 లక్షలు లేవు.. రూ.30 లక్షలు లేవు అంతా గ్యాస్, ట్రాష్ అని ధ్వజమెత్తారు.
150 ఉత్తరాలు రాసినా ఇయ్యలే
విద్యాచట్టం ప్రకారం దేశంలో ప్రతి జిల్లాకు కేంద్ర ప్రభుత్వం ఒక నవోదయ పాఠశాల ఏర్పాటు చేయాలని కేసీఆర్ తెలిపారు. అయినప్పటికీ నరేంద్రమోదీ చట్టాన్ని ఉల్లంఘించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నవోదయ పాఠశాల కోసం తాను 150 ఉత్తరాలు రాశానని, వందసార్లు అడిగానని తెలిపారు. ‘అయ్యా మాది కొత్త రాష్ట్రం. నవోదయ పాఠశాల ఇవ్వండి’ అని అడిగితే ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం మొత్తంలో నరేంద్రమోదీ 150 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేశారని, కానీ తెలంగాణకు ఒక్కటంటే ఒక్కటి కూడా ఇవ్వలేదని మండిపడ్డారు.
వినోద్ గెలుపు ఖాయమైంది
కరీంనగర్కు ఎప్పుడు వచ్చినా ప్రజలు ఎమోషనల్ స్వాగతం చెప్పారని, ఇప్పుడు కూడా అద్భుతంగా స్వాగతం పలికారని కేసీఆర్ సంతోషం వ్యక్తంచేశారు. తన దగ్గర ఉన్న సర్వే ప్రకారం ఇప్పటికే వినోద్కుమార్ 8 శాతం ఓట్లతో ముందంజలో ఉన్నారని, ఆయన గెలుపు ఖాయమైందని, 13 తారీఖు వరకు ఇదే ఉత్సాహాన్ని కొనసాగించాలని కార్యకర్తలకు సూచించారు.
కరెంటుకు ఏమైంది?
కాళేశ్వరం పేరుమీద కూడా రాజకీయం చేస్తున్నారని, అందులో ఏదో ఉందని చెప్తున్నారని బీఆర్ఎస్ అధినేత మండిపడ్డారు. తాము కరీంనగర్ను బ్రహ్మాండంగా తీర్చిదిద్దామని, అప్పర్ మానేరు నుంచి అన్నారం వరకు కాకతీయ కాలువను పదినెలలు పారించి, గోదావరిపై బరాజ్లు కట్టి, 200 కిలోమీటర్లమేర గోదావరిని సజీవ గోదావరిని చేసి అమృతధారలు లాంటి నాలుగు జలధారలు కరీంనగర్ చుట్టూ నిర్మించామని గుర్తుచేశారు.
నేడు అన్నీ మాయమైపోయాయని, బోరుబండ్లు, పూడిక తీసే క్రేన్లు మళ్లీ ఊళ్లలోకి వస్తున్నాయని ఆవేదన వ్యక్తంచేశారు. చొప్పదండి వద్ద ఒక రైతు కల్లంలో వడ్లు ఎండబెట్టి, 20రోజులైనా వడ్లు కొనడం లేదనే ఆందోళనతో, ఎండవేడి తట్టుకోలేక ప్రాణం కోల్పోయాడని తెలిపారు. తాము 9 ఏండ్లపాటు రెప్పపాటు కూడా పోకుండా ఇచ్చిన కరెంటు నేడు ఏమైపోయిందని నిలదీశారు. మిషన్ భగీరథతో తాము బ్రహ్మాండంగా సరఫరా చేసిన నీళ్లు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. ఇవన్నీ చూస్తుంటే తన కండ్ల నుంచి నీళ్లు వస్తున్నాయని తెలిపారు. నాలుగైదు నెలల్లోనే ఎందుకింత ఆగమాగం అన్నది ఆలోచించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
విజ్ఞతతో ఓటేయండి
తెలంగాణలో తమ ప్రభుత్వం ప్రతి మహిళలకు రూ. 2,500 చొప్పున ఇస్తున్నట్టు రాహుల్గాంధీ నిర్మల్ సభలో చెప్పారని, ఎవరికైనా వచ్చాయా అని ప్రశ్నించారు. కాంగ్రెస్ జాతీయ మహిళా అధ్యక్షురాలు అల్కాలాంబా కూడా నారీశక్తి పేరుతో మహిళలతో ఓ సమావేశం ఏర్పాటుచేసి మహిళలకు ఇప్పటికే రూ. 2,500 చొప్పున ఇస్తున్నట్టు చెప్పారని తెలిపారు.
ఒక్కరూపాయి కూడా ఎవరికీ రాలేదని, వచ్చే పరిస్థితి కూడా లేదని కేసీఆర్ స్పష్టం చేశారు. కాబట్టి విజ్ఞతతో ఆలోచించి మంచివాళ్లకు ఓటు వేయాలని సూచించారు. వినోద్కుమార్ ఉద్యమ కార్యకర్త కాబట్టి ఆయన్ను గెలిపించాలని కోరారు. బెల్టుషాపులు రద్దుచేస్తామని కాంగ్రెస్ చెప్పిందని, అది చేయలేదు కానీ మందుకొట్టుడు మాత్రం పెరిగిందని ఎద్దేవా చేశారు. మద్యం అమ్మకాలు పెరిగాయని కేసీఆర్ పేర్కొన్నారు.
బండి సంజయ్కు అసలు మాట్లాడడం వస్తదా? ఆయన గట్టిగా మాట్లాడితే అది హిందీనా, ఇంగ్లిషా, తెలుగా అనేది అర్థంకాక మనమే సావాలి. ఆయన మాట్లాడేది మనకే అర్థంకాకపోతే పార్లమెంటులో ఎలా అర్థమైతది.
-కేసీఆర్
పొలం దున్నినోడికే రైతుబంధు ఇస్తామని చెప్తున్నారు. మరి వారినెలా గుర్తిస్తరు? రెండు నెలల వరకు రైతులు పొలాలు దున్నుతారు, రెండు నెలల వరకు నాట్లు వేస్తరు. మరి వారినెలా గుర్తిస్తరు? రైతుబంధు మొత్తాన్ని గోల్మాల్ చేసి, ఆగమాగం చేసే కుట్రకు ఈ ప్రభుత్వం తెరలేపుతున్నది.
-కేసీఆర్
చేతనైనోళ్లు చేయగలిగిందే చెప్పాలె
చేతనైనోళ్లు, దమ్మున్నోళ్లయితే చేయగిలిగిందే చెప్పాలని, రైతుబంధు ఇస్తానని తాను ఎన్నికల్లో చెప్పలేదని, అయినా రైతుల మేలు కోరి ఇచ్చామని కేసీఆర్ తెలిపారు. రైతులను నిలబెట్టాలనే ఉద్దేశంతో తడిసిన వడ్లను సైతం కొనుగోలు చేశామని చెప్పారు. రైతు చనిపోతే రూ.5 లక్షల బీమా ఇచ్చామని, ఇప్పుడు అది కూడా తీసేస్తామని చెప్తున్నారని పేర్కొన్నారు.
ఐదు ఎకరాలు దాటినోళ్లకు రైతుబంధు ఇచ్చేది లేదని రేవంత్రెడ్డి చాలా డేంజర్ మాట మాట్లాడుతున్నాడని, పొలం దున్నినోడికే రైతుబంధు ఇస్తామని చెప్తున్నారని, వారిని ఎలా గుర్తిస్తారో చెప్పాలని ప్రశ్నించారు. రెండు నెలల వరకు పొలాలు దున్నుతారని, రెండు నెలల వరకు నాట్లు వేస్తారని మరి వారిని ఎలా గుర్తిస్తారని నిలదీశారు. అధికారుల వద్దకు వెళ్లి దున్నినట్టు సర్టిఫికెట్ తీసుకోవాల్సి వస్తుందని, దాని కోసం అధికారులు లంచాలు అడుగుతారని హెచ్చరించారు.
రైతుబంధు మొత్తం గోల్మాల్ చేసి, ఆగమాగం చేసే కుట్రకు ఈ ప్రభుత్వం తెరలేపుతున్నదని అనుమానం వ్యక్తంచేశారు. రూ.15వేలు ఇస్తామని నమ్మబలికి నేడు ఉన్న పదివేలు కూడా ఇవ్వకుండా కిందమీద చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. కల్యాణలక్ష్మికి సంబంధించి ఇంతవరకు కొత్త చెక్కులు ఇవ్వడం లేదని తెలిపారు. గతంలో పేదలు జబ్బు వస్తే ఎమ్మెల్యే వద్దకు వెళ్తే సీఎంఆర్ఎఫ్ చెక్కులు వచ్చేవని, నేడు ఒక్క సీఎంఆర్ఎఫ్ చెక్కు కూడా ఇవ్వడంలేదని మండిపడ్డారు. రేషన్ కార్డులపై సన్నబియ్యం ఇస్తామని వాగ్దానం చేసి మాట తప్పారని చెప్పారు.
బీజేపీని ఓడించేది బీఆరెస్సే
‘అల్లా కే ఘర్ మే దేర్ హై.. మగర్ అందేర్ నహీ హై’ అని తాను తరుచూ చెప్పేవాడినని, అల్లా దయతో తెలంగాణ సిద్ధించిందని కేసీఆర్ పేర్కొన్నారు. కరీంనగర్లో బీఆర్ఎస్, బీజేపీ మధ్యే పోటీ ఉన్నదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ మూడో స్థానంలో ఉన్నదన్నారు. ముస్లింలు పొరపాటున కాంగ్రెస్కు ఓటువేస్తే బీజేపీ గెలుస్తుందని హెచ్చరించారు.
కరీంనగర్ బీజేపీ ఎంపీ ఎంత గలీజు మనిషో అందరికీ తెలుసని, కరీంనగర్తోపాటు నిజామాబాద్లో కూడా బీజేపీని ఓడించాల్సిన అవసరం ఉన్నదని పేర్కొన్నారు. బీజేపీని ఓడించే సత్తా బీఆర్ఎస్కే ఉన్నదని చెప్పారు. బీఆర్ఎస్ హయాంలో ముస్లింల సంక్షేమం కోసం చేపట్టిన కార్యక్రమాలను గుర్తు చేసుకోవాలని కోరారు. ముస్లిం విద్యార్థుల కోసం రెసిడెన్షియన్ స్కూళ్లను ప్రారంభించామని తెలిపారు. వినోద్ కుమార్ సెక్యులర్ మనిషని, ఆయనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఉచితబస్సుల్లో కొట్లాటలు
ఇచ్చిన వాటిలో కాంగ్రెస్ నెరవేర్చింది ఒక్క ఉచిత బస్సు మాత్రమేనని, ఈ పథకం వల్ల బస్సుల్లో కొట్లాటలు జరుగుతున్నాయని కేసీఆర్ పేర్కొన్నారు. ఫ్రీ బస్సుల్లో సర్కస్లో జరిగినట్టు కొట్లాటలు జరుగుతున్నాయని తెలిపారు. ఈ పథకం తమకు అక్కర్లేదని మహిళలే చెప్తున్నారని వివరించారు. ఈ పథకంతో ఆటోరిక్షా కార్మికులు రోడ్డున పడ్డారని ఆవేదన వ్యక్తంచేశారు. ఆటోరిక్షా కార్మికులు, రైతు కూలీలకు ఏడాదికి రూ. 12 వేలు ఇస్తామని చెప్పి మోసం చేశారని కాంగ్రెస్ను దుయ్యబట్టారు.
అప్పట్లో కాంగ్రెస్ వాళ్లు ‘మావల్లనే నువ్వు గెలిచావు’ అని నన్ను అవమానిస్తే, నాకు కోపం వచ్చి తెలంగాణ పౌరుషం చూపించాలని పదవికి రాజీనామా చేసిన. ఉప ఎన్నికల్లో రెండున్నర లక్షల మెజార్టీతో గెలిపించి నన్ను గుండెల్లో పెట్టుకొని తెలంగాణ ఉద్యమాన్ని లేపిన గడ్డ ఈ కరీంనగర్.
– కేసీఆర్
మోదీ ఎమోషనల్ బ్లాక్మెయిల్
ప్రధానమంత్రి నరేంద్రమోదీ పదేండ్ల పాలనలో దేశంలో ఏ ఒక్క వర్గానికి న్యాయం జరగలేదని, ఆయన ఇచ్చిన ఏ ఒక్క హమీ నెరవేరలేదని కేసీఆర్ విమర్శించారు. ఏమైనా మాట్లాడితే పాకిస్థాన్ను చూపిస్తూ పుల్వామా అంటూ పదేండ్లుగా ప్రజలను ఫూల్స్ చేస్తూనే ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాకిస్థాన్ గింతంత(చిన్న) దేశమని, ఒక్క జాపడ కొడితే 25 ఏండ్లు మన తెరువు, జోలికి రాదని, అలాంటి పాకిస్థాన్ను చూపించి గ్యాస్ కొడుతూ, డ్రామా చూపిస్తూ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తూ మనందర్నీ పదేండ్లుగా ఫూల్స్ చేస్తున్నారని పేర్కొన్నారు.
మోదీ చేసే ఎమోషనల్ బ్లాక్మెయిల్ క్యారీ అయితే ఈ దేశం ఇకపై మరింత నాశనమైతుందని ఆందోళన వ్యక్తం చేశారు. పేదలకు ఎన్నడూ రూపాయి కూడా ఇవ్వని మోదీ కార్పొరేట్లకు మాత్రం రూ.15 లక్షల కోట్ల రుణాలను మాఫీ చేశారని, అదేమైనా ఆయన అబ్బ సొత్తా? అని ప్రశ్నించారు. మోదీ ఒక్కరే రూ.105 లక్షల కోట్ల అప్పు చేశారని, 700 మంది రైతులను పొట్టకున్నారని, ఉత్తరప్రదేశ్లో ఎన్నికలు రాగానే అదే రైతులను క్షమాపణ వేడుకొని గట్టెక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అవసరం రాగానే ‘మాఫీ కా చౌదాఘర్’లా వ్యవహరించారని పేర్కొన్నారు. మోదీ చెప్పిన అచ్చేదిన్ రాలేదు కానీ సచ్చేదిన్ వచ్చిందని తూర్పారబట్టారు. పదేండ్ల క్రితం మోదీ ఇచ్చిన 150 హామీల్లో ఒక్కటీ నెరవేర్చలేదని విమర్శించారు. డీజిల్, పెట్రోల్, ఎరువుల ధరలు పెంచి పేదలు బతకలేని పరిస్థితి తీసుకొచ్చారని ఆవేదన వ్యక్తంచేశారు. మేకిన్ ఇండియా, డిజిటల్ ఇండియా, వికసిత్ భారత్ అన్నీ విఫలమై చివరికి విఫల భారత్ అయిందని ఎద్దేవా చేశారు. ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన మోదీ ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని తెలిపారు.
పాకిస్థాన్ను చూపిస్తూ పుల్వామా అంటూ పదేండ్లుగా మోదీ ప్రజలను ఫూల్స్ చేస్తున్నరు. గింత చిన్నదేశం, ఒక్క జాపడకొడితే 25 ఏండ్లు మన తెరువు, జోలికి రాదు. అలాంటి పాక్ను చూపిస్తూ మోదీ ఎమోషనల్ బ్లాక్మెయిల్ చేస్తున్నరు.
– కేసీఆర్
మాట్లాడడం రాని బండి సంజయ్ పార్లమెంటుకా?
బండి సంజయ్తో పైసా పని కాలేదని, ఆయన ఒక్కనాడు కూడా పార్లమెంటులో మాట్లాడలేదని కేసీఆర్ విమర్శించారు. అసలు ఆయనకు మాట్లాడడం వస్తుందా? అని ప్రశ్నించారు. ఆయన గట్టిగా మాట్లాడితే అది హిందీనా, ఇంగ్లిషా, తెలుగా అనేది అర్థంకాక మనమే సావాలని ఎద్దేవా చేశారు.
ఆయన మాట్లాడేది మనకే అర్థంకాకపోతే పార్లమెంటులో ఎలా అర్థమవుతుందని ప్రశ్నించారు. అటువంటి వ్యక్తిని మళ్లీ పార్లమెంటుకు పంపుదామా? అని ప్రశ్నించారు. న్యాయవాది, కమ్యూనిస్టు కుటుంబంలో, ఉద్యమాల కుటుంబంలో బిడ్డగా పుట్టి, తెలంగాణ కోసం 2001 నుంచి తనతో ఉండి, తెలంగాణ ఉద్యమంలో అడుగడునా పాలుపంచుకున్న వినోద్ను పంపుదామా? బండి సంజయ్ను పంపుదామా? అనేదాన్ని కరీంనగర్ గడ్డ ఆలోచించాలని కోరారు.
మాయమాటలతో కాంగ్రెస్ దగా
కాంగ్రెస్ పార్టీ నేతలు గత అసెంబ్లీ ఎన్నికల్లో అరచేతిలో వైకుంఠం చూపించి, ఆరు గ్యారెంటీలు, అందులో 13అంశాలు, మరో 420 గ్యారెంటీలు.. ఇలా నోటికొచ్చిన హామీలు ఇచ్చారని కేసీఆర్ తెలిపారు. మహిళలకు రూ.2500, కల్యాణలక్ష్మి కింద తులం బంగారం ఎవరికైనా వచ్చిందా? అని ప్రశ్నించారు. నాడు నోట్ల రద్దు, కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం తగ్గినా రెండు విడతల్లో రూ. 30 వేల కోట్ల రైతుల రుణాలు మాఫీ చేసినట్టు గుర్తుచేశారు.
మరి రేవంత్రెడ్డి చేస్తానన్న రూ. 2 లక్షల రుణమాఫీ అయిందా? అని ప్రశ్నించారు. రైతుబంధు అందరికీ ఇవ్వడం లేదని, వడ్లు కొంటలేరని, మద్దతు ధర లేదని, ప్రతిచోటా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. రైతుబంధు తాము రూ. 10వేలు ఇస్తే, వారు రూ.15వేలు ఇస్తామన్నారని, తాము 2,000 పెన్షన్.. వారు రూ.4000 ఇస్తామని చెప్పి ఇవ్వలేదని చెప్పారు. తాము ఇచ్చిన వాటికి డబుల్, ట్రిపుల్ ఇస్తామని చెప్పి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఇచ్చిన హామీల్లో ఉచిత బస్సు మాత్రమే అమలైంది. అందులో సర్కస్ లాంటి కొట్లాటలు జరుగుతున్నయ్. ఈ పథకం వద్దని మహిళలే చెప్తున్నరు. ఈ పథకంతో ఆటోరిక్షా కార్మికులు రోడ్డన పడ్డరు.
– కేసీఆర్
కరీంనగర్ అభివృద్ధి మీ కండ్లముందే
గత ఎన్నికల్లో మంచికో చెడ్డకో కరీంనగర్లో ఒకడు, ఆదిలాబాద్లో ఒకడు, సికింద్రాబాద్లో ఒకడు, నిజామాబాద్లో ఒకడు ఇలా నలుగురు బీజేపీ ఎంపీలు గెలిచారని కేసీఆర్ పేర్కొన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వీరు కనీసం నాలుగు రూపాయల పనైనా చేశారా అని ప్రశ్నించారు. కరీంనగర్లో గెలిచిన బండి సంజయ్ ఇక్కడి ప్రజలకు ఏమైనా పని చేశారా?, ఆయన వల్ల ఏమైనా అభివృద్ధి జరిగిందా? అని ప్రశ్నించారు.
బీజేపీ ఎంతసేపూ మతం పిచ్చితో మాట్లాడటం, పంచాయితీలు పెట్టడం తప్ప ఆ పార్టీతో ఎవరికైనా లాభం జరిగిందా? అని నిలదీశారు. కరీంనగర్ను స్మార్ట్సిటీగా చేయించిందే వినోద్కుమార్ అని తెలిపారు. గతంలో ఎలాగో ఉన్న కరీంనగర్ను రోజూ తనతో కొట్లాడి రూ. 2000 కోట్లు తెచ్చి ప్రతి రోడ్డును తీర్చిదిద్ది, సుందర దృశ్యాలు తెచ్చింది గంగుల కమలాకర్ అని ప్రశంసించారు. అభివృద్ధి అంతా మీ కళ్లముందే జరిగిందని, కేబుల్ బిడ్జీల నిర్మాణం, పట్టణ అభివృద్ధి అంతా మీ కండ్ల ముందే ఉన్నదని పేర్కొన్నారు.
నన్ను చంపినా మీటర్లు పెట్టనన్న
తెలంగాణ కొత్త రాష్ట్రం కాబట్టి సాగునీటి ప్రాజెక్టులు నిర్మించుకుంటున్నామని, ఏదైనా ఒక ప్రాజెక్టుకు జాతీయ ఇవ్వాలని కోరితే ఒక్క ప్రాజెక్టుకు కూడా మోదీ జాతీయ హోదా ఇవ్వలేదని కేసీఆర్ పేర్కొన్నారు. మోదీ తన మెడపై కత్తి పెట్టి.. ‘కేసీఆర్ నువ్వు మీ రైతుల మోటర్లకు మీటర్లు పెట్టాలి. లేకపోతే సంవత్సరానికి రూ. 5వేల కోట్ల గ్రాంట్ కట్ చేస్తా’అని బెదిరించారని తెలిపారు. కానీ తాను మాత్రం ‘నా రాష్ట్రం నాకు తెలుసు. నా రైతుల బాధ నాకు తెలుసు. నువ్వు నన్ను చంపినా సరే. నా తల తెగిపడ్డా సరే నేను మీటర్లు పెట్టే ప్రసక్తే లేదని చెప్పిన. నువ్వు ఏం చేసుకుంటవో చేస్కో నేను మాత్రం మీటర్లు పెట్టను.’ అని తేల్చి చెప్పినట్టు గుర్తుచేశారు.