KCR : హైదరాబాద్లో తాగునీటి సరఫరా లేక ప్రజలు ట్యాంకర్లు కొనుగోలు చేస్తుండటంపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము అద్భుతంగా నడిపిన మిషన్ భగీరథ స్కీమ్ను కాంగ్రెస్ సర్కారు ఎందుకు నడపలేకపోతున్నదని ప్రశ్నించారు. పొలంబాట కార్యక్రమంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్లో పర్యటించిన కేసీఆర్.. సాయంత్రం ప్రెస్మీట్లో మాట్లాడారు.
‘హైదరాబాద్లో మళ్ల ట్యాంకర్లు ఎందుకు వస్తున్నయ్..? ప్రజలు ఎందుకు ట్యాంకర్లు కొంటున్నరు..? ఆ కర్మ ఎందుకు పట్టింది ప్రజలకు..? ప్రభుత్వం సమాధానం చెప్పాలె. మేం హైదరాబాద్లో ప్రతి ఇంటికి 20 వేల లీటర్ల ఉచిత తాగునీళ్లు ఇచ్చినం. ఇప్పుడు బిల్లులు వస్తున్నయ్ నీళ్లకు. ప్రభుత్వానికి చీము, నెత్తురు, పౌరుషం ఉంటే.. హైదరాబాద్ ప్రజలు కర్రుకాల్చి వాత పెట్టకముందే మేల్కోవాలి. ప్రభుత్వ పెద్దలారా ట్యాంకర్లను ఉచితంగా సప్లయ్ చేయండి. ఇది నేను డిమాండ్ చేసి అడుగుతున్నా. మీకు ప్రజల మీద ప్రేమ ఉంటే ఉచితంగా నీటి ట్యాంకర్లను సప్లయ్ చేయండి. లేదంటే మిమ్ములను దోషులుగా పరిగణిస్తరు హైదరాబాద్ ప్రజలు. పరిగణించాలె కూడా’ అని కేసీఆర్ మండిపడ్డారు.
‘నీటి సరఫరాపై అసలు మీరు సమీక్ష చేస్తున్నరా..? పొద్దు మాపున సమీక్ష చేయాలె. సీఎంవోలో ఒక అధికారి ఉండాలె. ప్రజల తాగునీళ్లు అంటే మీకు తమాషాగా ఉందా..? ఎందుకు ఎండబెడుతున్నరు హైదరాబాదీల గొంతులను..? నీళ్లు లేకనా.. స్కీమ్ లేకనా..? బంగారం లాంటి మిషన్ భగీరథ స్కీమ్ ఉండంగా ఎందుకిట్ల చేస్తున్నరు..? మీరు ఇప్పటికైనా యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకుని గోదావరి మొదలు కాగానే నీళ్లను ఎట్ల ఎత్తిపోయాలనే దానికి రెడీ కండి. లేదంటే మేం రెడీ అయితం. ఎట్ల జెయ్యాల్నో అట్ల జేస్తం. మేం చూపిస్తం తమాషా మీకు. రాష్ట్రం రణరంగమైనా మంచిదే’ అని ఆయన హెచ్చరించారు.