KCR : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం అద్భుతంగా నడిపిన పథకాలను నడిపడానికి చేతగాదా..? అని ఆయన మండిపడ్డారు. ‘కేసీఆర్ పొలం బాట’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో పర్యటించిన కేసీఆర్.. ఎండిన పంటలను పరిశీలించారు. ఆ తర్వాత సాయంత్రం 6 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి మీడియాతో మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు.
‘పేదలందరి ఇండ్లలో నల్లాలు ఉండాలనే ఒక అద్భుతమైన ఆలోచనతోటి మేం ఒక్కటంటే ఒక్కటే రూపాయికి కనెక్షన్లు ఇచ్చి రాష్ట్రమంతటా నల్లాలు పెట్టించినం. మీ ఇందిరమ్మ రాజ్యంలో, మీ కాంగ్రెస్ రాజ్యంలో మీ ముండ ముఖాలకు ఎన్నడూ ఇయ్యలే. ఎన్నడూ ఇట్లాంటి ఆలోచన చెయ్యలే. మేం రాష్ట్రంలో పుష్కలంగా నీళ్లిచ్చి బిందెలు కనపడకుండా చేసినం’ అన్నారు.
‘ఇయ్యాల మళ్ల బిందెలు ఎందుకు వస్తున్నయ్..? తొమ్మిదేళ్లు నడిచిన కరెంటును నడిపే తెలివిలేదు మీకు. ఆరేండ్లు బ్రహ్మాండంగా నడిచిన మిషన్ భగీరథను నడిపే తెలివిలేదు మీకు. నడిచినయే గదా..! వాటికేం రోగమొచ్చింది..? కారణం మీ అసమర్థతనే గదా..? మీ చవట తనమే గదా..? జవాబు చెప్పాలె మీరు ప్రజలకిప్పుడు’ అని కేసీఆర్ నిలదీశారు.