హైదరాబాద్, ఏప్రిల్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ భవన్లో ఈ నెల 18వ తేదీ (గురువారం)న బీఆర్ఎస్ పార్టీ కీలక సమీక్షా సమావేశం నిర్వహించనున్నది. ఈ సమావేశంలో పార్టీ అధినేత కేసీఆర్ ఎంపీ అభ్యర్థులకు బీఫారాలతోపాటు ఎన్నికల నియమావళిని అనుసరించి అభ్యర్థికి రూ. 95 లక్షల చెక్కును ఒక్కో అభ్యర్థికి అందించనున్నారు. ఈ సమీక్షా సమావేశానికి ఎంపీ అభ్యర్థులతో పాటు పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలు, పార్టీ జిల్లా అధ్యక్షులు, జడ్పీ చైర్మన్లు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, పార్టీ నేతలు హాజరుకానున్నారు. బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారం, అనుసరించే వ్యూహంపై కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు.
ఈనెల 13న చేవెళ్ల బహిరంగసభ ద్వారా కేసీఆర్ పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. మంగళవారం అందోల్ నియోజకవర్గంలోని సుల్తాన్పూర్లో ప్రజా ఆశీర్వాదసభకు అశేష ప్రజానీకం హాజరై కేసీఆర్కు జైకొట్టారు. ఈ క్రమంలో తాను ప్రజలకు మరింత చేరువ కావాలని కేసీఆర్ నిర్ణయించారు. కరువుతో అల్లాడుతున్న రాష్ట్ర రైతాం గం వద్దకు వెళ్లి వారి కష్ట సుఖాలను తెలుసుకోవడానికి, వారికి భరోసానివ్వడానికి రాష్ట్ర వ్యాప్తంగా బస్సు యాత్రలు నిర్వహించాలని కేసీఆర్ నిర్ణయించారు. గురువారం సమావేశంలో కేసీఆర్ బస్సు యాత్ర రూట్ మ్యాప్పై చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.