KCR | హైదరాబాద్, జనవరి 13 (నమస్తే తెలంగాణ): రైతు పండుగ సంక్రాంతి పర్వదినం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు శుభాకాంక్షలు తెలియజేశారు. భోగితో ప్రారంభమై మకర సంక్రాంతి, కనుమతో మూడు రోజులపాటుసాగే సంక్రాంతి పండుగ, వ్యవసాయాధారిత పల్లె సంస్కృతిలో ప్రత్యేకతను చాటుకుంటుందని పేర్కొన్నారు. పండిన పంటల రాశులతో ఇండ్లు కళకళలాడుతూ, రైతుల జీవితాల్లో సంక్రాంతి శోభ నిండుదనాన్ని సంతరించుకుంటుందని తెలిపారు. రంగవల్లులు, గొబ్బెమ్మలతో పిల్లలు, పెద్దలు గుమిగూడి ఆనందోత్సాహాల నడుమ జరుపుకునే ప్రకృతి పండుగ మకర సంక్రాంతి అని వివరించారు.
నూతన తెలంగాణ రాష్ట్రంలో వ్యవసాయం పండుగ కావాలని, పాడిపంటలతో రైతు కుటుంబాల్లో సంతోషం వెల్లివిరియాలన్న దృఢ సంకల్పంతో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అనేక పథకాలను ప్రారంభించిందని గుర్తుచేశారు. వ్యవసాయం, దాని అనుబంధ రంగాల అభివృద్ధి, రైతు సంక్షేమమే తొలి ప్రాధాన్య అంశంగా నాడు అమలుచేసిన కార్యాచరణ, పదేండ్ల అనతికాలంలోనే సత్ఫలితాలనిచ్చిందని వివరించారు. 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ప్రాజెక్టులు, కాల్వల ద్వారా సాగునీరు, పంటకు పెట్టుబడి సాయంగా రైతుబంధు, రైతు కుటుంబానికి భరోసాగా రైతుబీమా వంటి పలు పథకాలను పటిష్ఠంగా అమలుచేశామని గుర్తుచేశారు. తద్వారా సాధించిన వ్యవసాయ ప్రగతి ప్రపంచవ్యాప్తంగా పలు ప్రశంసలు అందుకున్నదని, దేశానికే ఆదర్శంగా తెలంగాణను నిలిపిందని పేర్కొన్నారు.
దండుగన్న సాగును పండుగ చేసింది బీఆర్ఎస్
వ్యవసాయానికి దన్నుగా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన కులవృత్తులకు మునుపెన్నడూలేని విధంగా బీఆర్ఎస్ ప్రభుత్వం అందించిన ప్రోత్సాహం, ఆర్థిక సహకారం, సబ్బండ కులాల జీవితాల్లో సంక్రాంతి శోభను నింపిందని కేసీఆర్ తెలిపారు. పదేండ్ల బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు నాలుగున్నర లక్షల కోట్ల రూపాయల నిధులను వ్యవసాయరంగ అభివృద్ధి కోసం ఖర్చు చేసిందని వివరించారు. ఎవరెన్ని విమర్శలు చేసినా రైతు జీవితాల్లో వెలుగులు నింపాలనే ధృఢ సంకల్పంతో ముందుకు సాగామని, ఆ పట్టుదలతోనే తెలంగాణ వ్యవసాయంలో ప్రగతి సాధ్యమైందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఒకనాడు దండుగన్న తెలంగాణ వ్యవసాయం బీఆర్ఎస్ హయాంలో సంక్రాంతి పండుగలా మారిందని కేసీఆర్ పునరుద్ఘాటించారు. రాజకీయాలకు అతీతంగా రైతన్న సంక్షేమమే ధ్యేయంగా, రాజీపడకుండా పదేండ్ల ప్రగతి ప్రస్థానాన్ని నేటి ప్రభుత్వం కొనసాగించాలని కేసీఆర్ సూచించారు. తద్వారా సాధించే ప్రగతి ద్వారా మాత్రమే రైతు పండుగ సంక్రాంతి వేడుకలకు వన్నె చేకూర్చినవారమవుతామని తెలిపారు. రైతన్న జీవితాల్లో వెలుగులు కొనసాగేలా దీవించాలని ప్రకృతిమాతను కేసీఆర్ ప్రార్థించారు.