KCR : ఖమ్మం లోక్సభ బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావుకు ఆశ ఎక్కువని, నా రాష్ట్రం బాగుపడాలె.. నా జిల్లా బాగుపడాలె.. అని ఆయన ఆరాటపడుతుంటడని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ ఖమ్మం పట్టణంలో కేసీఆర్ రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్భంగా కార్నర్ మీటింగ్లో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఎండలు మండుతున్నా జనం తన రోడ్షోకు తరలిరావడంపై సంతోషం వ్యక్తంచేశారు.
‘ఈ రోజు 42, 43 డిగ్రీల ఎండ ఉన్నా లెక్కచేయకుండా విశేషంగా తరలి వచ్చిన నా అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్లకు నమస్కారం. నామా నాగేశ్వర్రావుకు ఆశ ఎక్కువ. నా రాష్ట్రం బాగుపడాలె, నా జిల్లా బాగుపడాలె అని ఆయన కొంచెం ఆరాటపడుతుంటడు. ఒక దశలో తెలంగాణలో పంటలు పంజాబ్ను తలదన్నే స్థాయికి పోయినయ్. మూడున్నర కోట్ల టన్నుల వడ్లు పండించినం. దాంతో కేంద్ర ప్రభుత్వం మేం ధాన్యం కొనం అని మొండికేసింది. నామా నాగేశ్వర్ నాయకత్వంలో మన ఎంపీలు పొయ్యి కేంద్ర మంత్రిని కలిసిండ్రు. యాసంగిలో కొంచెం నూక అయితదని, కొనుగోలు చేయాలని అడిగిండ్రు. దానికి ఆ మెదడు తక్కువ కేంద్ర మంత్రి మీ తెలంగాణ ప్రజలు నూకలు తినండి అన్నడు’ అని కేసీఆర్ విమర్శించారు.
‘ కేంద్ర మంత్రి వ్యాఖ్యలను నిరసిస్తూ మొత్తం తెలంగాణ క్యాబినెట్ పొయ్యి ఢిల్లీలో ధర్నా చేసినం. కానీ ఆ సమయంలో ఒక్క కాంగ్రెస్ ఎంపీగానీ, ఒక్క బీజేపీ ఎంపీగానీ నోరు తెరువలే. పార్లమెంటులో మనం 9 మందిమి ఉంటే.. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు కలిపి ఏడుగురు ఉండె. ఏడుగురిలో ఒక్కరు నోరు మెదపలే. వాళ్లకు తెలంగాణ ఓట్లు కావాలె గానీ, తెలంగాణ రైతుల సమస్య పట్టదు. ఇంతకుముందు నామా నాగేశ్వర్ రావు ఇదే మాట చెప్పిండ్రు. కాంగ్రెస్, బీజేపీ ఎంపీలు నోరు తెరువలేదని ఆవేదన వ్యక్తం చేసిండు. ఆయనకు ఆ బాధ ఉన్నది’ అని కేసీఆర్ అన్నారు.