KCR | ఎమోషనల్ డ్రామాతో పదేళ్లుగా మోదీ నేతృత్వంలోని కేసీఆర్ ప్రభుత్వం ప్రజలను ఫూల్స్ చేస్తుందని బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు విమర్శించారు. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఆయన కరీంనగర్లో రోడ్షో నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ చౌరస్తాలో నిర్వహించిన కార్నర్ మీటింగ్లో మాట్లాడుతూ.. ‘ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మూడు పార్టీలు మీ ముందున్నయ్. ఇందులో దేశాన్ని పాలిస్తున్న భారతీయ జనతా పార్టీ మీ ముందున్నది. ఒక్కటే మాట మనవి చేస్తున్న. పదేళ్లనాడు ఈ దేశానికి ప్రధానిమంత్రి అయ్యిండు. దగ్గర దగ్గర 150 హామీలు ఇచ్చిండు. ఏ ఒక్క హామీ అన్న నెరవేర్చిండా? సబ్కా సాత్ సబ్కా వికాస్ ఏమన్నా అయ్యిందా? దేశ్కా సత్యనాశ్ అయ్యింది. అచ్చేదిన్ రాలేదు కానీ.. సచ్చేదిన్ వచ్చినయ్. పెట్రోల్, డీజిల్, ఎరువుల ధరల పెరిగినయ్. పేదలు బతకలేని పరిస్థితి వచ్చింది తప్ప అచ్చేదిన్ రాలేదు. వికసిత్ భారత్ కాలేదు కానీ.. విఫల భారత్ అయ్యింది’ అంటూ మండిపడ్డారు.
‘మాట్లాడితే పాకిస్తాన్ను చూపించాలి. పాకిస్తాన్ చిన్న దేశం. ఒక్క జాపట్ కొడితే 25 ఏళ్లు మన తెరువురాడు. వాణ్ణి చూపించి.. ఓ డ్రామా చేసి.. ఎమోషనల్ డ్రామా చేసి మనల్ని పది సంవత్సరాలు ఫూల్స్ చేస్తున్నరు. అందరూ దయచేసి ఆలోచన చేయాలి. ముఖ్యంగా యువకులు, విద్యావంతులు, మేథావులు, కరీంనగర్ పట్టణంలో, ఈ ప్రాంతంలో ఉన్న రచయితలకు దండంపెట్టి చెబుతున్న.. మోదీ చేసే ఎమోషనల్ బ్లాక్ మెయిల్ క్యారీ అయితే.. ఈ దేశం ఇప్పటికే సర్వనాశనం అయ్యింది. మోదీకన్నా ముందున్న 14 మంది ప్రధానమంత్రులు కేవలం 55లక్షల కోట్ల అప్పు చేస్తే రూ.105లక్షల కోట్ల అప్పు చేసిండు. రూపాయి విలువ పడింది. ఎగుమతులు భారత్ నుంచి నిలిచిపోయాయి. దిగుమతులు భారీగా పెరిగాయి. విదేశీ మారకద్రవ్యం నిలువ తగ్గిపోయినయ్. సంవత్సరానికి 2కోట్ల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఒక్కటీ చేయలేదు. ఏ ఒక్క వర్గానికి దళితులు, గిరిజనులకో, మహిళలకో, పేదలకో, మైనారిటీలకో.. రైతులకో మేలు జరుగలేదు’ అని ఆరోపించారు.
‘ఢిల్లీలో ధర్నా చేస్తే 750 మంది రైతులను మోదీ పొట్టనపట్టుకున్నడు. యూపీలో ఎన్నికలుంటే అదే రైతులకు క్షమాపణలు వేడుకొని.. గట్టెక్కిండు. ఆయనకు అప్పుడు బిరుదు ఇచ్చారు. మాఫీకా సౌదాగర్ అని చెప్పి. ఈ రకంగా ఆయనకు ఓట్లు అక్కర ఉన్నప్పుడు.. డ్రామాలు, వేషాలు కట్టి ప్రజల మధ్య చీలికలు తెచ్చి.. మతవిద్వేషాలు పెంచి.. ఒకరకమైన ద్వేషపూరిత వాతావరణం నింపుతరు తప్ప బీజేపీ ఎజెండాలో పేదల మాటల ఉండదు. కార్పొరేట్ల కోసం రూ.15లక్షల కోట్ల ప్రజల సొమ్మును బ్యాంకు రుణాలను ఆయన అబ్బసొత్తులా మాఫీ చేసిండు కానీ.. రైతులకు రూపాయి ఇవ్వలేదు. ఎవ్వరికీ మేలు జరుగలేదు. అన్నీ వట్టి డైలాగులు.. డబ్బాలో రాళ్లువేసి ఊపినట్లుగా లొడలొడ ఊపుడు తప్ప ఏ ఒక్కమాట నిజం కాలేదు. దయచేసి నా మాటను ఆషామాషీగా తీసుకోకుండా మేధావులు, విజ్ఞులు ఆలోచించాలని కోరుతున్నా’నన్నారు కేసీఆర్.