సూర్యాపేట, ఫిబ్రవరి 10 (నమస్తే తెలంగాణ)/వరంగల్ (నమస్తే తెలంగాణ ప్రతినిధి): బీఆర్ఎస్ పార్టీ ఈ నెల 13న నల్లగొండలో తలపెట్టిన ‘చలో నల్లగొండ’ సభ విజయవంతం కోసం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా సన్నాహాక సమావేశాలు ఉత్సాహ భరితంగా సాగుతున్నాయి. సాగర్, శ్రీశైలం ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడాన్ని నిరసిస్తూ ఆయకట్టు రైతులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలిరావాలని నాయకులు పిలుపునిస్తున్నారు.
శనివారం నల్లగొండ జరిగిన బీఆర్ఎస్ నియోజకవర్గ స్థాయి సమావేశంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి మాట్లాడారు. తెలంగాణ కోసం కొట్లాడింది నీళ్లు.. నిధులు.. నియామకాల కోసమనేనని, కృష్ణా నీటిలో మన వాటా తేల్చకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించడం తెలంగాణ హక్కులను కోల్పోవడమేనని మండిపడ్డారు.
కృష్ణా నీటిపై కేంద్రానికి అన్ని హక్కులు పోతే, ఆఖరికి మంచినీటికి కూడా సొంతంగా వాడుకునే పరిస్థితి ఉండదని ఆందోళన వ్యక్తం చేశారు. అనుభవం లేని ముఖ్యమంత్రి, మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ఆలేరులో జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు గొంగిడి సునీతామహేందర్రెడ్డి, కల్వకుంట్ల విద్యాసాగర్రావు మాట్లాడుతూ.. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేవరకు ఉద్యమిస్తామని స్పష్టంచేశారు.
కోదాడలో ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్రావు, మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్యయాదవ్, హుజూర్నగర్లో మాజీ ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, చంటి కాంత్రి కిరణ్ ‘చలో నల్లగొండ’ సభ పోస్టర్ను ఆవిష్కరించారు. దేవరకొండలో బీఆర్ఎస్ నల్లగొండ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే రమావత్ రవీంద్ర కుమార్, సభ ఇన్చార్జి పన్యాల భూపతిరెడ్డి, బీబీనగర్లో భువనగిరి నియోజకవర్గ ఇన్చార్జి జీవీ రామకృష్ణారావు, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి, నాగార్జుసాగర్లో మాజీ ఎమ్మెల్యే నోముల భగత్, జాజుల పాల్గొని సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.
ఉమ్మడి వరంగల్ నుంచి 20 వేల మంది: ఎర్రబెల్లి
సాగునీటి రంగంలో తెలంగాణకు అన్యాయం జరిగేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు వ్యతిరేకంగా నల్లగొండలో బీఆర్ఎస్ నిర్వహిస్తున్న బహిరంగసభకు ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి 20 వేల మంది వరకు జనాలు వెళ్లనున్నారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు తెలిపారు. పాలకుర్తి, జనగామ, స్టేషన్ఘన్పూర్ నియోజకవర్గాల నుంచి నాలుగు వేల మంది చొప్పున.. మిగిలిన నియోజకవర్గాల నుంచి వెయ్యి మందికి తగ్గకుండా రైతులు, ప్రజలు, బీఆర్ఎస్ కార్యకర్తలు, ముఖ్యనేతలు నల్లగొండ సభకు హాజరవుతారని చెప్పారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి భారీ సంఖ్యలో నల్లగొండ సభకు తరలి రావాలని ప్రజలకు పిలుపునిచ్చారు.