BRS | హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల నిర్వహించేందుకు గులాబీ శ్రేణులు సిద్ధమయ్యాయి. శనివారం నుంచి మూడు రోజులపాటు వైభవంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తామని పార్టీ అధినేత కేసీఆర్ ఇప్పటికే ప్రకటించారు. ఇందులో భాగంగా తెలంగాణ ఉద్యమకారులు, ప్రజలతో శనివారం హైదరాబాద్ గన్పార్క్లోని తెలంగాణ అమరవీరుల స్థూపం నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ సచివాలయం ఎదురుగా ఉన్న అమరజ్యోతి వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించనున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తోపాటు పార్టీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, జంట నగరాల పార్టీ శ్రేణులతో భారీ ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు పూర్తయ్యాయి.
రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణభవన్లో జరిగే కార్యక్రమానికి కేసీఆర్ అధ్యక్షత వహించనున్నారు. తెలంగాణ ఉద్యమ ప్రస్థానంతోపాటు గత పదేండ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం సాధించిన ప్రగతి, ప్రజల జీవితాల్లో వచ్చిన మార్పులు తదితర అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. అనంతరం బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు హైదరాబాద్లోని పలు దవాఖానలు, అనాథ శరణాలయాల్లోని వారికి మిఠాయిలు, పండ్లు పంపిణీ చేయనున్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను మూడు రోజులపాటు ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇప్పటికే పార్టీ జిల్లా అధ్యక్షులకు సూచించారు.