రాజన్న సిరిసిల్ల : సిరిసిల్ల సహకార విద్యుత్ సరఫరా సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘన విజయం సాధించింది. ప్రతి పక్షాలు చెప్పిన కల్లిబొల్లిమాటలను ప్రజలు విశ్వసించలేదు. పన్నిన కుట్రలు, కుతంత్రాలను తిప్పికొట్టారు. తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధికి రైతన్నలు, వినియోగదారులు పట్టం కట్టి తమ కృతజ్ఞతను చాటుకున్నారు. 15 డైరెక్టర్ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో ఇప్పటివరకు 14 స్థానాల ఫలితాల్లో 13 మంది బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులే విజయం సాధించారు. మిగతా రెండు స్థానాల ఫలితాలు రావాల్సి ఉంది. టీఆర్ఎస్ను బీఆర్ఎస్గా మార్చిన తర్వాత జరిగిన తొల్లి ఎన్నికల్లో సెస్పై గులాబీ జెండా ఎగుర వేసి సత్తా చాటింది. ఆపార్టీ కార్యకర్తలు, నేతనల్లో నూతనోత్సాహం నెలకొంది. ఇతర జిల్లాల నుంచి వచ్చిన బీజేపీ నేతల ప్రయత్నాలు ఇక్కడ ఏమాత్రం పనిచేయలేదు.
సిరిసిల్ల, వేములవాడ, మానకొండూర్, చొప్పదండి నియోజవకర్గాల పరిధిలోని 15 సెస్ డైరెక్టర్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి. సోమవారం ఫలితాలు వెల్లడయ్యాయి. 15 స్థానాలకు 14 స్థానాల్లో బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు గెలిచారు. వేములవాడ రూరల్లో రీకౌంటింగ్ కొనసాగుతున్నది.
1. చిక్కాల రామారావు – తంగళ్లపల్లి
2. దిద్ది రమాదేవి – సిరిసిల్ల 1
3. దార్నం లక్ష్మీనారాయణ – సిరిసిల్ల 2
4. వర్స కృష్ణహరి – ఎల్లారెడ్డిపేట
5. గౌరినేని నారాయణరావు – గంభీరావుపేట
6. చందుపట్ల అంజిరెడ్డి – ముస్తాబాద్
7. మాడుగుల మల్లేశం – వీర్నపల్లి
8. మల్లుగారి రవీందర్రెడ్డి – ఇల్లంతకుంట
9. నామాల ఉమ – వేములవాడ 1
10. రేగులపాటి హరిచరణ్రావు – వేములవాడ అర్బన్
11. పొన్నాల శ్రీనివాసరావు – చందుర్తి
12. ఆకుల గంగారాం – రుద్రంగి
13. దేవరకొండ తిరుపతి – కోనరావుపేట
14. కొటపల్లి సుధాకర్ – బోయినపల్లి
మొత్తం 15స్థానాలకుగాను 75 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. సెస్ పరిధిలో మొత్తం 87,130 మంది ఓటర్లు ఉన్నారు. గతంలో జరిగిన ఎన్నికల్లో ఎప్పుడూ 75 నుంచి 80 శాతం మాత్రమే పోలింగ్ నమోదైంది. కానీ, ఈ సారి మాత్రం 73,189 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సెస్ చరిత్రలోనే రికార్డు స్థాయిలో 84 శా తం నమోదైందని అధికారులు తెలిపారు.
ఉద్యమ సమయంలో 2007లో సెస్కు ఎన్నికలు జరిగాయి. ఆనాటి ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. సెస్పరిధిలో 11 స్థానాలను క్లీన్ స్వీప్ చేసి, సెస్ను కైవసం చేసుకున్నారు. చైర్మన్గా చిక్కాల రామారావు, వైస్చైర్మన్గా గూడూరి ప్రవీణ్ బాధ్యతలు చేపట్టారు. తర్వాత 2010లోనూ సెస్ను టీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. 2016లో జరిగిన ఎన్నికల్లో సైతం పార్టీ బలపరిచిన అభ్యర్థులే గెలుపొందారు. అప్పటి నుంచి జరిగిన ప్రతి ఎన్నికల్లోనూ టీఆర్ఎస్ సెస్ను కైవసం చేసుకుంటూ వస్తుండగా, తాజాగా జరిగిన ఎన్నికల్లోనూ ఆపార్టీ విజయం సాధించింది. బీఆర్ఎస్గా పేరు మార్చిన తర్వాత మొదటి సారి జరిగిన సెస్ ఎన్నికల్లోనూ గెలిపించి సిరిసిల్ల ప్రజలు అభివృద్ధి ప్రధాత మంత్రి రామన్నకు వెన్నంటి నిలిచారు.