హైదరాబాద్, ఏప్రిల్ 13 (నమస్తే తెలంగాణ) : వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అధ్యక్షుడు దూసరి అశోక్ గౌడ్ విజ్ఞప్తి చేశారు. లండన్లో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే కార్యవర్గం భేటీలో అశోక్గౌడ్ మాట్లాడుతూ.. వచ్చే లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు ఎన్నారై బీఆర్ఎస్ యూకే ప్రత్యేకంగా కృషి చేస్తుందని తెలిపారు.
కాంగ్రెస్ వందరోజుల పాలనలో రాష్ట్రంలో విద్యుత్తు సమస్యలు, నీళ్ల సమస్యలతో పాటు రైతుల ఆత్మహత్యలు పెరిగాయని మండిపడ్డారు. కాంగ్రెస్ ఇచ్చిన ఒక హామీ కూడా సక్రమంగా అమలు చేయకపోవడంపై ప్రజలు ఆగ్రహంతో ఊగిపోతున్నారని తెలిపారు. ప్రజల పక్షాన నిలబడి పోరాడేది బీఆర్ఎస్ మాత్రమే అని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలను, సమస్యలను పార్లమెంట్ వేదికగా తెలంగాణ గొంతుకను వినిపించేది గులాబీ పార్టీ ఎంపీలేనని తెలిపారు.
సమావేశంలో ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ యూకే అడ్వైజరీ బోర్డు వైస్ చైర్మన్ చందుగౌడ్ సికా, ఉపాధ్యక్షుడు నవీన్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి రత్నాకర్ కడుదుల, కార్యదర్శి సత్యమూర్తి చిలుముల, ఎన్ఆర్ఐ బీఆర్ఎస్ నేతలు రవి ప్రదీప్ పులుసు, అబ్దుల్ జాఫర్, వెంకట్ రెడ్డి, సురేశ్ గోపతి, వీర ప్రవీణ్ కుమార్, రమేశ్ ఎసెంపెల్లి, రవి రేతినేని, సత్యపాల్ పింగిళి, పృథ్వీ రావుల, గణేశ్ కుప్పలా, మధు యాదవ్ ఆబోతు తదితరులు పాల్గొన్నారు.