రఘునాథపాలెం, ఏప్రిల్ 8 : కాంగ్రెస్ పార్టీ తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు మొండిచెయ్యి చూపిస్తున్నదని ఖమ్మం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు అన్నారు. సోమవారం ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం చిమ్మపూడి గ్రామంలో నిర్వహించిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ గొంతుకను పార్లమెంట్లో వినిపించేందుకు, రాష్ట్ర ప్రయోజనాల కోసం బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులను గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నదని సూచించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదేండ్లు ముఖ్యమంత్రిగా ఉండి రాష్ర్టాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపారని కొనియాడారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ వంద రోజుల్లోనే రాష్ట్ర ప్రజలను నానా ఇబ్బందులకు గురిచేస్తున్నదని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ నుంచి గెలిచిన ఎంపీలు ఏనాడూ జిల్లా, రాష్ట్ర ప్రయోజనాలను గుర్తించి మాట్లాడిందిలేదన్నారు. కేంద్రం నల్లచట్టాలు తీసుకొచ్చి మీటర్లు పెట్టాలని చూస్తే బీఆర్ఎస్ పార్టీ కొట్లాడి అడ్డుకున్నదని గుర్తుచేశారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్సీ తాతా మధుసూదన్ మాట్లాడుతూ.. నామాను గెలిపించుకుంటే వచ్చే ఐదేండ్లు కార్యకర్తలకు కొండంత అండగా ఉంటారని తెలిపారు.