కోటగిరి, అక్టోబర్ 22 : కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎన్నికల సమయంలో మాయమాటలు చెబుతున్నారని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి విమర్శించారు. ఇటీవలే కర్ణాటకలో మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చారని.. ప్రస్తుతం అక్కడ కరెంటుకే దిక్కు లేదని అన్నారు. నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలం జల్లాపల్లి అబాదిలో ఆదివారం నిర్వహించిన సేవాలాల్, జగదాంబ మాత ఆలయంలో విగ్రహ ప్రతిష్ఠాపనోత్సవంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ సహకారంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్టు తెలిపారు.
ఈ ఎన్నికల్లో ఓటు ద్వారా తనను ఆశీర్వదించాలని కోరారు. తెలంగాణ వచ్చిన తర్వాతే గ్రామాలు, తండాల అభివృద్ధికి పుష్కలంగా నిధులు వస్తున్నాయని తెలిపారు. కర్ణాటకలో కాంగ్రెస్కు ఓటు వేసి గెలిపించినందుకు అక్కడి ప్రజలు ప్రస్తుతం నానా ఇబ్బందులు పడుతున్నారని, ఇక్కడ కూడా కాంగ్రెస్ నాయకుల మాటలను నమ్మొద్దని అన్నారు. తెలంగాణ అభివృద్ధి కావాలంటే సీఎంగా కేసీఆర్ ఉండాలె.. ఇక్కడ పోచారం ఉండాలె అని సూచించారు.