KTR | రేపటి నుంచి జరిగే ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల అవగాహన తరగతులను బహిష్కరించాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. ఈ మేరకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఒక ప్రకటన విడుదల చేశారు. మా హక్కులకు భంగం కలిగేలా స్పీకర్ వ్యవహరించారని కేటీఆర్ తెలిపారు. తొలిరోజే తమను లోపలికి రాకుండా అరెస్టు చేయించారని పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు, ప్రజా సమస్యలు ఎత్తిచూపితే అరెస్టు చేశారని చెప్పారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అక్రమ పార్టీ ఫిరాయింపులపై నిర్ణయం తీసుకోకుండా స్పీకర్ నాన్చుడు ధోరణి అవలంబిస్తున్నారని కేటీఆర్ అన్నారు. గత అసెంబ్లీ సమావేశాల్లోనూ తమ గొంతు నొక్కేలా వ్యవహరించారని తెలిపారు. తమకు అవకాశం ఇవ్వకుండా స్పీకర్ ఏకపక్షంగా వ్యవహరించారని పేర్కొన్నారు. తమ శాసనసభ్యుల్లో అతి తక్కువ మంది మాత్రమే కొత్త వాళ్లు ఉన్నారని తెలిపారు. ఏకపక్షంగా వ్యవహరిస్తున్న స్పీకర్ వ్యవహారశైలికి నిరసనగా రేపటి నుంచి జరగనున్న అవగాహన తరగతులను బహిష్కరిస్తున్నామని తెలిపారు. ఇప్పటికైనా పార్టీలకు అతీతంగా ఎలాంటి వివక్ష లేకుండా వ్యవహరించాలని స్పీకర్ను విజ్ఞప్తి చేశారు.