దేశ రాజధాని తెలంగాణ ఆత్మగౌరవ పతాకం రెపరెపలాడింది. దేశ పరివర్తనే లక్ష్యంగా జాతీయ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్.. హస్తినలో తన కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించుకున్నది. ఢిల్లీలోని వసంత్విహార్లో బీఆర్ఎస్ ఆఫీస్ను పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం మధ్యాహ్నం ప్రారంభించారు. వాస్తుపూజ, సుదర్శన హోమం నిర్వహించిన అనంతరం మొదటి అంతస్థులోని అధ్యక్ష చాంబర్కు చేరుకున్న కేసీఆర్.. పలు పత్రాలపై సంతకాలు చేశారు. పలువురు రాష్ట్ర ప్రముఖులు, ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ జాతీయ నాయకుల సమక్షంలో ప్రారంభ కార్యక్రమం అట్టహాసంగా సాగింది.
BRS Bhawan | హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): హస్తినలో తెలంగాణ ఆత్మగౌరవ జెండా రెపరెపలాడింది. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పులకోసం భారత రాష్ట్ర సమితి నూతన అధ్యాయానికి శ్రీకారం చుట్టింది. దేశ రాజధాని ఢిల్లీలోని వసంత్విహార్లో బీఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం అట్టహాసంగా ప్రారంభించారు. అంతకుముందు బీఆర్ఎస్ భవన్ ఆవరణలో గులాబీ జెండాను ఆవిష్కరించారు. వాస్తుపూజ, సుదర్శన హో మం నిర్వహించిన అనంతరం మధ్యాహ్నం 1:05 గంటలకు కార్యాలయం ప్రారంభించి, లోపల అడుగుపెట్టారు. అనంతరం మొదటి అంతస్థులోని పార్టీ అధ్యక్ష చాంబర్కు చేరుకొన్నారు. మొదటిసారి అధ్యక్షుడి హోదాలో ఆసీనులైన కేసీఆర్ పలు పత్రాలపై సంతకాలు చేశారు. ఈ సందర్భంగా పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావుకు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి, మంత్రులు కేటీఆర్, వేముల ప్రశాంత్రెడ్డి, పార్లమెంటరీ పార్టీ నేత కే కేశవరావు, లోక్సభా పక్షనేత నామా నాగేశ్వరరావు, ఎంపీలు సంతోష్కుమార్, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్, వెంకటేశ్నేత, మాలోత్ కవిత, కొత్త ప్రభాకర్రెడ్డి, బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి, ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మంద జగన్నాథం, బీఆర్ఎస్ కిసాన్ సెల్ అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ, పార్టీ ఎంపీలు, మంత్రులు, ఇతర నాయకులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛాలు అందజేసి, శుభాకాంక్షలు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ప్రత్యేక విమానంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీకి వచ్చారు. మధ్యాహ్నం 12 గంటలకు ఎయిర్పోర్టుకు చేరుకొన్నారు. ఎయిర్పోర్టులో ఆయనకు రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీ, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి, ఢిల్లీలోని తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి, తెలంగాణ రెసిడెంట్ కమిషనర్ గౌరవ్ ఉప్పల్, హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, జాగృతి నేత విద్యాసాగర్, టీఆర్ఎస్వీ నేత చందు, డాక్టర్ సుగుణాకర్రాజు స్వాగతం పలికారు. 12:30 గంటలకు సీఎం కేసీఆర్ కాన్వాయ్లో బయలుదేరి 15 నిమిషాల్లో వసంత్విహార్లోని పార్టీ కార్యాలయానికి చేరుకొన్నారు. తొలుత పార్టీ కార్యాలయం బయట నిర్మించిన యాగశాల వద్ద పూజల్లో పాల్గొన్నారు. వేద పండితుల ఆశీర్వచనాలు తీసుకొన్నారు. అనంతరం పార్టీ కార్యాలయ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. గంటవరకు పార్టీ ఆఫీసులోనే ఉన్న కేసీఆర్ ఆపై 2:15 గంటలకు తుగ్లక్రోడ్లోని ఇంటికి చేరుకొన్నారు. భోజనం చేసిన అనంతరం సీఎం కేసీఆర్ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్, ఎంపీలు కేశవరావు, సంతోష్, వద్దిరాజు రవిచంద్ర, బీబీ పాటిల్, ఎమ్మెల్సీ మధుసూదనాచారి తదితరులు కలిశారు. సరిగ్గా 4 గంటలకు తుగ్లక్రోడ్డులోని ఇంటి నుంచి ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకొని, హైదరాబాద్ బయల్దేరారు. మొత్తం నాలుగు గంటల్లోనే సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన ముగిసింది.
బీఆర్ఎస్ భవన్ నుంచి దాదాపు రెండు కిలోమీటర్ల పరిధిలో పార్టీ అధినేత, సీఎం కేసీఆర్కు స్వాగతం పలుకుతూ పెద్ద ఎత్తున పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. వసంత్విహార్ పరిసరాలన్నీ గులాబీమయంగా మారాయి. ప్రారంభోత్సవం సందర్భంగా బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయ ఆవరణలో యాగం, స్తోత్ర పారాయణాలతో శుభకరమైన వాతావరణం నెలకొన్నది. పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు చేరుకోవడంతో బీఆర్ఎస్ భవన్ పరిసరాల్లో సందడి కనిపించింది. బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున సంబురాలు చేసుకొన్నారు. బీఆర్ఎస్ భవన్ ప్రారంభోత్సవం సందర్భంగా కార్యాలయం దగ్గర తెలంగాణ పోలీసులతోపాటు ఢిల్లీ పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వసంత్విహార్ మెట్రోస్టేషన్ నుంచి బీఆర్ఎస్ భవన్ వరకు భద్రతను కట్టుదిట్టం చేశారు.
వాస్తుశాస్త్ర ప్రమాణాల ప్రకారం అత్యంత వైభవోపేతంగా బీఆర్ఎస్ భవన్ కార్యాలయం రూపుదిద్దుకొన్నది. మొదటి అంతస్థులో పార్టీ అధ్యక్షుడి కార్యాలయం ఉన్నది. ప్రెసిడెంట్, వరింగ్ ప్రెసిండెంట్లకు ప్రత్యేక చాంబర్లు కేటాయించారు. భవన్లో వీటితోపాటు ఇతర అవసరాల కోసం మొత్తం 18 గదులు ఉన్నాయి. పార్టీ సమావేశాల కోసం భవన్లో విశాలమైన సమావేశ మందిరాన్ని నిర్మించారు. దేశ రాజధాని కేంద్రంగా బీఆర్ఎస్ పార్టీ కేం ద్ర కార్యాలయం ప్రారంభంకావడంతో పార్టీ విస్తరణ పనులు వేగవంతంకానున్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో బీఆర్ఎస్ పా ర్టీ కార్యాలయాన్ని ప్రారంభించుకోవ డం ప్రతి ఒక గులా బీ సైనికుడికి గర్వకారణమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తెలంగాణ సాధనే లక్ష్యంగా ప్రారంభమైన బీఆర్ఎస్, అనేక రాజకీయ ఒడిదొడుకులను తట్టుకొని లక్ష్యాన్ని సాధించిందని చెప్పారు. సీఎం కేసీఆర్ నిబద్ధతను మెచ్చి, ప్రత్యేక తెలంగాణకు 39 రాజకీయ పార్టీలు మద్దతు ఇచ్చాయని గుర్తు చేశారు. కేసీఆర్ రాజనీతిజ్ఞతతో ఏర్పడిన తెలంగాణ ఈ రోజు అభివృద్ధిలో దూసుకెళ్తున్నదని అన్నారు. 9 మంది లోక్సభ ఎంపీలు, ఏడుగురు రాజ్యసభ సభ్యులు, 105 మంది ఎమ్మెల్యేలతో బీఆర్ఎస్ పార్టీ జాతీయస్థాయిలో కీలక పార్టీగా ఎదిగిందని పేర్కొన్నారు. సీఎం కేసీఆర్ దూరదృష్టి, పట్టుదల, నిబద్ధత బీఆర్ఎస్ పార్టీని ఉన్నత స్థానానికి తీసుకెళ్లాయని ఆమె గురువారం ట్వీట్ చేశారు.