హైదరాబాద్, మే 15 (నమస్తే తెలంగాణ): నమ్మిన ప్రజలను సీఎం జగన్ నట్టేట ముంచారని బీఆర్ఎస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ ఆరోపించారు. సోమవారం హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో ఏపీలోని పల్నాడు జిల్లా వినుకొండ నియోజకవర్గానికి చెందిన ఏపీ నాయుడు ఆధ్వర్యంలో డీ సైదావలి సహా పలు జిల్లాల నాయకులు, కార్యకర్తలు బీఆర్ఎస్లో చేరారు. వీరికి తోట చంద్రశేఖర్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ సర్కార్పై తోట విరుచుకుపడ్డారు. జగన్ పాలనలో అవినీతి పరాకాష్టకు చేరిందని ధ్వజమెత్తారు.
ఇసుక, గంజాయి మాఫియా పెట్రేగిపోతున్నదని మండిపడ్డారు. వైసీపీ నాయకుల ప్రోత్సాహంతో రాష్ట్రంలో గంజాయి విచ్చలవిడిగా పెరిగిపోయిందని ఆరోపించారు. దేశంలో ఎకడా లేనన్ని మద్యం బ్రాండ్లు ఏపీలోనే దొరుకుతాయన్నాయని విమర్శించారు. ప్రభుత్వం కల్తీ మద్యాన్ని విక్రయిస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నదని ఆందోళన వ్యక్తం చేశారు. ఖజానా నింపుకొనేందుకు వైసీపీ పెద్దలు ప్రజల ప్రాణాలను పణంగా పెడతారా? అని ప్రశ్నించారు. సంక్షేమ పాలన అందిస్తామని అధికారం చేపట్టిన జగన్ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపేందుకు ప్రజలు ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు. రానున్న ఎన్నికల్లో ఏపీలో బీఆర్ఎస్ కీలకపాత్ర పోషించనున్నదని చెప్పారు.