Minister Harish Rao | నెట్వర్క్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ఆర్థికమంత్రి హరీశ్రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహం వ్యక్తంచేశాయి. రెండోరోజు మంగళవారం కూడా రాష్ట్రంలోని పలుచోట్ల మైనంపల్లి దిష్టిబొమ్మలను పార్టీ నాయకులు దహనం చేశారు. మంత్రి హరీశ్రావుకు భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేనిపక్షంలో మైనంపల్లిని తెలంగాణలో తిరగనివ్వబోమని హెచ్చరించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న మంత్రి హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని ఆగ్రహం వ్యక్తంచేశారు. మైనంపల్లి.. నోరు మూసుకో అనుచిత వ్యాఖ్యలు వెనక్కు తీసుకో,నీ స్థాయి ఏమిటో తెలుసుకొని రౌడీ రాజకీయాలు మానుకోవాలని హెచ్చరించారు. మరోవైపు సోషల్ మీడియాలోను మంత్రి హరీశ్రావుకు మద్దతు వెల్లువెత్తింది. హరీశన్న.. మేమంతా మీ వెంటే అనే హాష్ట్యాగ్తో ట్విట్టర్లో ట్రెండింగ్ నడిచింది. హరీశ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాల్సిందేనని నెటిజన్లు సైతం డిమాండ్ చేశారు.
మైనంపల్లి దిష్టిబొమ్మల దహనం
మంత్రి హరీశ్రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ రెండోరోజు మంగళవారం కూడా మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనలు నిర్వహించాయి. మెదక్ జిల్లా టేక్మాల్లో మెనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. నీతి, నిజాయితీ, నిబద్ధ్దతకు నిలువుదట్టం లాంటి హరీశ్రావును విమర్శిస్తే ఖబడ్దార్ అంటూ మైనంపల్లిని జోగిపేట ఏఎంసీ మాజీ చైర్మన్ నాగభూషణం హెచ్చరించారు. మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని బీఆర్ఎస్ నాయకులు రవీందర్నాయక్, రమేశ్చౌహాన్, రవినాయక్ డిమాండ్ చేశారు. నారాయణఖేడ్ మండలం డీఎన్టీ తండాలో మైనంపల్లి చిత్రపటాన్ని దహనం చేశారు. హుస్నాబాద్లోని అంబేద్కర్ చౌరస్తాలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, ఎంపీపీ లకావత్ మానస, పార్టీ నాయకులు ధర్నా, రాస్తారోకో నిర్వహించి మైనంపల్లి ఫ్లెక్సీని దహనం చేశారు. కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. చేర్యాలలోని పాతబస్టాండ్ వద్ద మున్సిపల్ వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, జిల్లా గ్రంధాలయ కమిటీ డైరెక్టర్ మేడిశెట్టి శ్రీధర్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు అంకుగారి శ్రీధర్రెడ్డి, రాష్ట్ర నాయకుడు ముస్త్యాల బాల్నర్సయ్య ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మ దహనం చేశారు.
కొమురవెల్లిలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గీస భిక్షపతి ఆధ్వర్యంలో మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. భేషరతుగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే మైనంపల్లిని తెలంగాణలో తిరగనివ్వబోమని బీఆర్ఎస్వీ నాయకుడు ఏర్పుల మహేశ్ హెచ్చరించారు. మద్దూరు, ధూళిమిట్ట మండల కేంద్రాల్లో బీఆర్ఎస్ మండల శాఖ అధ్యక్షులు మేక సంతోశ్కుమార్, మంద యాదగిరి, వైస్ఎంపీపీ మలిపెద్ది సుమలతామల్లేశం ఆధ్వర్యంలో హనుమంతరావు దిష్టిబొమ్మలను దహనం చేశారు. చిన్నకోడూరు, చౌడారంలో సర్పంచుల ఆధ్వర్యంలో హనుమంతరావు దిష్టిబొమ్మను దహనం చేశారు. సిద్దిపేట ముస్తాబాద్ చౌరస్తా మైనంపల్లి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నేతలు దహనం చేశారు. ఆందోళనలో సుడా చైర్మన్ మారెడ్డి రవీందర్రెడ్డి, రూరల్ జడ్పీటీసీ శ్రీహరి గౌడ్, ఆత్మకమిటీ చైర్మన్ ప్రభాకర్వర్మ, మండల పార్టీ అధ్యక్షుడు ఎర్ర యాదయ్య, సర్పంచులు తదితరులు పాల్గొన్నారు. సిద్దిపేట అంబేద్కర్ చౌరస్తాలో ఫ్ల్లకార్డులతో నిరసన తెలిపారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ అంబేదర్ చౌరస్తాలో మైనంపల్లి దిష్టిబొమ్మను దహనం చేశారు. జనగామ జిల్లాకేంద్రంతోపాటు తరిగొప్పులలోనూ దిష్టిబొమ్మను దహనం చేశారు. హనుమకొండ అదాలత్ జంక్షన్ వద్ద హనుమంతరావు దిష్టిబొమ్మను రాష్ట్ర ఎస్సీ, బేడ (బుడగ) జంగాల హక్కుల పోరాట సమితి నాయకులు దహనం చేశారు. హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని కొమురవెల్లి ఆలయ పాలక మండలి సభ్యుడు మరుపల్లి శ్రీనివాస్గౌడ్ సిద్దిపేట అంబేద్కర్ సర్కిల్లో నిరాహార దీక్షను చేపట్టారు. ఆయనకు టీఆర్ఎస్ నాయకులు సంఘీభావం తెలిపారు.
హరీశన్న మేమంతా మీ వెంటే!.. హాష్ట్యాగ్తో ట్విట్టర్లో ట్రెండింగ్
మంత్రి హరీశ్రావుపై మైనంపల్లి అభ్యంతరకర వ్యాఖ్యలను నెటిజన్లు సైతం తీవ్రంగా ఖండించారు. మేమంతా మీ వెంటే అంటూ హరీశ్రావుకు మద్దతుగా నిలిచారు. #wearewithuharishanna పేరుతో సోషల్ మీడియాలో ట్రెండింగ్ చేశారు. వేలాది మంది బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంత్రికి మద్దతుగా సందేశాలు పోస్టు చేశారు. 2004 నుంచి ఆరుసార్లు ఎన్నికల్లో మెజారిటీ ఓట్లతో ఎన్నికయ్యారంటూ లెక్కలను ప్రస్తావిస్తూ ట్విట్టర్లో వీడియోలను పోస్టు చేశారు. వైద్యశాఖ మంత్రిగా ఆరోగ్య రంగంలో హరీశ్రావు విశేష కృషి చేశారని, అలాంటి వ్యక్తిపై అడ్డగోలు వ్యాఖ్యలు చేసిన మైనంపల్లిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. కొందరు #SuspendMynampally అనే హ్యష్టాగ్ పేరుతో ట్రెండింగ్ చేశారు. సమగ్రతను కాపాడేందుకు మైనంపల్లి సస్పెన్షన్ తప్పనిసరి అంటూ చందు టీహెచ్ఆర్ ట్వీట్ చేశారు. హరీశ్రావు తన అద్బుతమైన పనితీరుతో ప్రజల జీవితాలను మెరుగుపర్చారని కబీర్ అనే యూజర్ పేర్కొన్నారు. సిద్దిపేట గడ్డలో ప్రజాబలం ఉన్న నాయకుడు మా హరీశ్ అన్న.. నీలాంటి ఎంతో మంది డబ్బు మదంతో వచ్చి చాలా మంచి కనుమరుగయ్యారు. నువ్వెంత నీ బతుకెంత మైనంపల్లి.. అంటూ ప్రేమ్ కుమార్ ట్వీట్ చేశారు. కొడుకుకు టికెట్ నిరాకరిస్తే మైనంపల్లి చేసిన అనుచిత వ్యాఖ్యలను, ప్రవర్తనను తీవ్రంగా ఖండిస్తున్నామని రాజ్బీర్కుమార్ ట్వీట్ చేశారు. ఇలా ట్విట్టర్ వేదికగానే వేల మంది #WeAreWithHarishanna అనే హ్యాష్టాగ్తో ట్రెండింగ్ చేస్తున్నారు.
రౌడీషీటర్, కబ్జా కోరు: కౌశిక్రెడ్డి
హరీశ్రావుపై మైనంపల్లి వ్యాఖ్యలను ఎమ్మెల్సీ పాడి కౌశిక్రెడ్డి తీవ్రంగా ఖండించారు. హనుమంతరావు చరిత్ర ఏమిటని ప్రశ్నించారు. ఒక రౌడీషీటర్, ల్యాండ్గ్రాబర్, స్త్రీలోలుడైన మైనంపల్లి మల్కాజిగిరిలో చేసే అరాచకాలను అక్కడి ప్రజలు మరచిపోరని అన్నారు. హరీశ్రావుతో హనుమంతరావుకు పోలికా? అని ప్రశ్నించారు. ‘హరీశ్రావుపై పోటీ చేసే దమ్ము ఉందా? సిద్దిపేటలో మీరు హరీశ్రావుపై పోటీచేసి గెలిస్తే..ముక్కు నేలకు రాసి, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా’ అని కౌశిక్రెడ్డి సవాల్ చేశారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్రావుపై తప్పుడు మాటలు మాట్లాడటం తగదని హితవు పలికారు. మైనంపల్లిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ను కోరారు.
నీ స్థాయి తెలుసుకో: భానుప్రసాద్రావు, ప్రభాకర్రావు
మైనంపల్లి స్థాయికి మించి మాట్లాడుతున్నారని, ముందు తన స్థాయి ఏమిటో తెలుసుకోవాలని బీఆర్ఎస్ చీఫ్ విప్ భానుప్రసాద్రావు సూచించారు. నిబద్ధత కలిగిన రాజకీయ నేత, పార్టీ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేస్తున్న హరీశ్రావుపై అర్థంపర్థం లేని వ్యాఖ్యలు చేయడం మంచిపద్ధతి కాదని హితవు పలికారు. మైనంపల్లిపై తప్పకుండా చర్యలు తీసుకోవాల్సిందేనని డిమాండ్ చేశారు. హరీశ్రావుపై మైనంపల్లి నోటికొచ్చిట్టు మాట్లాడటం బాధాకరమని ప్రభుత్వ విప్ ఎంఎస్ ప్రభాకర్ మండిపడ్డారు. ఇకనైనా రౌడీ రాజకీయాలు మానుకోవాలని, బెదిరింపు ధోరణిని మార్చుకోవాలని సూచించారు. హరీశ్రావుతోపాటు బీఆర్ఎస్ పార్టీకి హనుమంతరావు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఆ వ్యాఖ్యలు అర్థరహితం: మహిపాల్రెడ్డి
హరీశ్రావుపై మైనంపల్లి వ్యాఖ్యలపై ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మైనంపల్లి వ్యాఖ్యలు అర్ధరహితమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధన నుంచి నేటి బంగారు తెలంగాణ రూపకల్పనలో మంత్రి హరీశ్రావు పాత్ర ఎనలేనిదని కితాబిచ్చారు. సీఎం కేసీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ పార్టీ పురోభివృద్ధికి కృషిచేస్తున్న హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరైంది కాదని మండిపడ్డారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కష్టపడుతున్న మంత్రి హరీశ్రావుపై అనుచిత వ్యాఖ్యలు చేయడమంటే సూర్యుడిపై ఉమ్మేసినట్టేనని బీఆర్ఎస్ నేత ఈద శంకర్రెడ్డి మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కృషిచేసిన హరీశ్రావుపై మైనంపల్లి చేసిన వ్యాఖ్యలు గర్హనీయమని, ఇలాంటి వ్యాఖ్యలను తెలంగాణ సమాజం సహించబోదని హెచ్చరించారు.