Telangana | శంకరపట్నం: స్టాఫ్ నర్స్ ఫలితాల్లో కరీంనగర్ జిల్లాకు చెందిన అన్నాచెల్లెళ్లు సత్తా చాటారు. ఒకేసారి ఇద్దరూ ప్రభుత్వ ఉద్యోగాలకు ఎంపికయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం లింగాపూర్కు చెందిన రాజ కనుకయ్య-కోమల దంపతులకు కొడుకు కుమారస్వామి, కూతురు శిరీష ఉన్నారు. వీరి తండ్రి కనకయ్య కొన్నేండ్ల క్రితం అనారోగ్యంతో మరణించాడు. దీంతో తమకున్న కొద్దిపాటి భూమిని సాగుచేసుకుంటూ తల్లి కోమల ఇద్దరు పిల్లలను చదివించింది. విద్యాభ్యాసం పూర్తి చేసిన ఆ అన్నాచెల్లెలు.. 2022 మార్చిలో మెడికల్ అండ్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డ్ ఆధ్వర్యంలో స్టాప్ నర్స్ రిక్రూట్మెంట్కు నోటిఫికేషన్ జారీ చేయగా దరఖాస్తు చేసుకున్నారు. ఆరు నెలల క్రితం సీబీటీ ఆన్లైన్ ఎగ్జామ్ (కంప్యూటర్ బేస్డ్ టెస్ట్) పూర్తి చేసుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం సాయంత్రం ఫలితాలు వెలువడగా.. అన్నాచెల్లెళ్లు ఇద్దరూ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఈ విషయం తెలిసి ఆ తల్లి ఆనందానికి అవధుల్లేకుండా పోయింది. కాగా, కష్టపడి చదివి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన ఈ అన్నాచెల్లెళ్లను గ్రామస్థులు అభినందిస్తున్నారు.