హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 13 (నమస్తే తెలంగాణ): విదేశాల్లో మాస్టర్స్ డిగ్రీ, ఫెలోషిప్ చేయాలనే ఆశలను నెరవేర్చుకోవాలనుకునే మహిళలకు అంతర్జాతీయ సంస్థ బ్రిటిష్ కౌన్సిల్ చేయూతనిస్తున్నది. ప్రతియేటా ఇరవై దేశాలకు చెందిన మహిళలకు ఈ అవకాశం కల్పించి స్కాలర్షిప్లను అందిస్తున్నది. ఇందులో భాగంగా 2023-24 సంవత్సరానికి గాను స్టెమ్ (సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్ అండ్ మ్యాథ్స్) కోర్సుల్లో ప్రవేశం కల్పించనున్నట్లు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. తమ కెరీర్ను అద్భుతంగా తీర్చిదిద్దుకోవాలనుకునే మహిళల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్టు వెల్లడించింది.
స్టెమ్ కోర్సును అభ్యసించే భారతీయ మహిళలు యూకేలోని 21 యూనివర్సిటీల వ్యాప్తంగా కంప్యూటర్ సైన్స్, డాటా సైన్స్, బయోటెక్నాలజీ, పర్యావరణ ఇంజినీరింగ్, సివిల్ ఇంజినీరింగ్, మెడిసిన్, ప్రజారోగ్యం, రోబోటిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వంటి కోర్సుల్లో మాస్టర్స్ డిగ్రీల్లో ప్రవేశం పొందవచ్చని పేర్కొన్నది. ఆసక్తి గల మహిళా విద్యార్థులు 2023 మార్చి- మే మధ్యకాలంలో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. పూర్తి వివరాలకు www.britishcouncil. org/study-work-abroad/in-uk/scholarship-women-stem వెబ్సైట్ను సంప్రదించాల్సిందిగా బ్రిటిష్ కౌన్సిల్ సూచించింది. పరిశోధన, వినూత్న ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు స్టెమ్ స్కాలర్షిప్ సహాయపడుతుందని బ్రిటిష్ కౌన్సిల్ ఇండియా విద్యా నిర్దేశకులు రితికా చంద్ర పారూక్ పేర్కొన్నారు. 2022-23 సంవత్సరంలో 21 మంది భారతీయ మహిళలు స్కాలర్షిప్ను అందుకొని యూకేలో విద్యనభ్యసిస్తున్నట్టు ఆమె తెలిపారు.