హైదరాబాద్, జనవరి20 (నమస్తే తెలంగాణ) : కృష్ణా వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్-2 (కేడబ్ల్యూడీటీ) ప్రకటించిన అవార్డును పాక్షికంగానైనా అమలు చేసేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోరుతూ కర్ణాటక రాష్ట్రం దాఖలు చేసిన పిటిషన్ విచారణ మరోసారి వాయిదా పడింది. మార్చి14వ తేదీకి సుప్రీంకోర్టు బెంచ్ వాయిదా వేసింది. పిటిషన్పై ఇప్పటికే ఈనెల 10 నుంచి 12 వరకు మూడు రోజులుగా సుప్రీంకోర్టు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ రామసుబ్రహ్మణ్యం బెంచ్ విచారించిన విషయం తెలిసిందే. అయినా వాదనలు ముగిసిపోలేదు.
మరోవైపు పిటిషన్ విచారణ బెంచ్ ఎదుటకు తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో పిటిషన్ విచారణను త్వరితగతిన జరపాలని ప్రస్తుత బెంచ్కు ఆదేశాలు జారీ చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూరిని కోరుతూ కర్ణాటక రాష్ట్రం మరో పిటిషన్ను దాఖలు చేసింది. ఈ పిటిషన్ విచారణను 20వ తేదీన కొనసాగించాలని ప్రస్తుత బెంచ్కు సుప్రీంకోర్టు మార్గదర్శకాలు జారీచేసింది. అందులో భాగంగా సుప్రీంకోర్టులో శుక్రవారం పిటిషన్ విచారణకు రాగా, వాదనలు ప్రారంభించకుండానే మార్చి14వ తేదీకి బెంచ్ మళ్లీ వాయిదా వేసింది.