హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో బృహత్ పల్లె ప్రకృతి వనాలు చకాచకా రూపుదిద్దుకొం టున్నాయి. ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యంలో ఇప్పటికే మూడోవంతు వనాలు పూర్తయ్యాయి. మిగిలినచోట్ల పనులు వేగంగా సాగుతున్నాయి. ప్రతి గ్రామీణ మండలానికి ఒకటి చొప్పున రాష్ట్రంలో మొత్తం 2,725 బృహత్ పల్లెపకృతి వనాలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకోగా, 1,799 వనాలు ఇప్పటికే సిద్ధమయ్యాయి. భూపాలపల్లి, మహబూబ్నగర్, ములుగు జిల్లాల్లో ఇప్పటికే బీవీపీలు వందశాతం పూర్తయ్యాయి.
పచ్చదనం పెంచాలని, ప్రతి ఆవాసానికి పార్కు ఉండాలని భావించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. ఆ దిశగా తొలిదశలో ప్రతి గ్రామంలో ప్రకృతివనాలను ప్రారంభించారు. అలా రాష్ట్రవ్యాప్తంగా 19,472 పల్లె ప్రకృతి వనాలను ఏర్పాటు చేశారు. ఎకరానికి నాలుగు వేల మొక్కలు నాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. మొత్తం 13,657 ఎకరాల్లో మొక్కలు నాటారు. వీటి కోసం దాదాపుగా రూ.250 కోట్లు ఖర్చు చేశారు. ఆ కార్యక్రమం సత్ఫలితాలను ఇవ్వడంతో.. బృహత్ పల్లెప్రకృతి వనాలపై ప్రభుత్వం దృష్టి సారించింది. గ్రామీణ ప్రాంతాల్లోనూ పెద్ద పార్కులు ఉండాలన్న ఉద్దేశంతో సుమారు రూ.300 కోట్ల ఖర్చుతో ఈ కార్యక్రమం చేపట్టారు. ప్రతి గ్రామీణ మండలానికి ఒకటి చొప్పున వీటిని ఏర్పాటు చేస్తున్నారు. 5 నుంచి 10 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేసే బృహత్ పల్లె ప్రకృతి వనాలు (బీపీవీ) చిట్టడవుల్లా కనిపించనున్నాయి. తక్కువస్థలంలో ఎక్కువ మొక్కలు నాటే మియావాకి పద్ధతిని అనుసరిస్తూ బీపీవీలను రూపొందిస్తున్నారు.
ప్రతి గ్రామీణ మండలానికి ఐదు నుంచి పది ఎకరాల మధ్యలో బీపీవీల కోసం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు స్థలాలను సేకరించారు. మొత్తం 2,725 బీపీవీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. 1,799 బీపీవీలు ఇప్పటికే పూర్తి అయ్యాయి. 2001 బీపీవీల్లో మొక్కలు నాటడం పూర్తయ్యింది. బీవీపీల కోసం సుమారు 12 వేలకు పైగా ఎకరాల స్థలాలను గుర్తించారు. భూపాలపల్లి, మహబూబ్నగర్, ములుగు జిల్లాలు లక్ష్యాన్ని వంద శాతం చేరాయి. ఆదిలాబాద్, కామారెడ్డి, నారాయణ్పేట్, నిర్మల్, పెద్దపల్లి, సిరిసిల్ల, వనపర్తి జిల్లాల్లో బీపీవీలకు అవసరమైన భూమిని గుర్తించడంలో వందకు వందశాతం లక్ష్యాన్ని చేరుకున్నారు. నాగర్కర్నూల్, సిద్దిపేట, జనగామ, మెదక్, నిజామాబాద్, భువనగిరి, కొత్తగూడెం, గద్వాల, కరీంనగర్, ఆసిఫాబాద్, మంచిర్యాల, వికారాబాద్ జిల్లాల్లో 90 శాతానికి పైగా స్థలాలను గుర్తించారు. పట్టణ ప్రభావం ఎక్కువగా ఉన్న మేడ్చల్, రంగారెడ్డి, హన్మకొండ జిల్లాల్లో ఎకరాల విస్తీర్ణంలో భూములు దొరకడం కష్టతరమవుతున్నది.