హైదరాబాద్ : కార్మికుల క్రమశిక్షణ, శ్రమ శక్తితో సింగరేణికి మరో వందేళ్ల పాటు ఉజ్వల భవిత ఉంటుందని సింగరేణి సీఎండీ శ్రీధర్ అన్నారు. హైదరాబాద్లోని సింగరేణి భవన్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో పాల్గొని మాట్లాడారు. వ్యాపార విస్తరణ చర్యలతో కంపెనీ అభివృద్ధికి పటిష్ట పునాది వేశామన్నారు.
వచ్చే ఏడాది నుంచి నుంచి 10 మిలియన్ టన్నుల ఉత్పత్తి చేస్తామన్నారు. 2025 నాటికి 100 మిలియన్ టన్నుల వార్షిక ఉత్పత్తి చేసేలా కృషి చేస్తామన్నారు. దేశ ఇంధన అవసరాల కోసం బొగ్గు రంగంలో అనేక సంస్కరణలు తీసుకొస్తున్నారని, మున్ముందు కేవలం ప్రభుత్వ రంగ బొగ్గు సంస్థలే బొగ్గు తీసే పరిస్థితి ఉండబోదన్నారు. ప్రైవేట్ రంగం నుంచి తీవ్రమైన పోటీ ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలిపారు.
ఈ నేపథ్యంలో సింగరేణి కార్మికులు, అధికారులు, యూనియన్ నాయకులు సమష్టిగా సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. అంకితభావం, క్రమశిక్షణ కలిగిన సింగరేణీయులు తమ శ్రమ శక్తితో ఇలాగే కష్టపడి పనిచేస్తే కంపెనీకి మరో వందేళ్ల పాటు ఉజ్వల భవిష్యత్ ఉంటుందన్నారు.
దేశంలో వందేళ్ల లో ఎన్నో ప్రభుత్వ రంగ కంపెనీలు ఆవిర్భవించాయని, అలాగే నష్టాలతో మూతపడ్డాయన్నారు. కానీ సింగరేణి మాత్రం 13 దశాబ్దాలుగా అంచెలంచెలుగా ఎదుగుతూ దేశంలోని దిగ్గజ ప్రభుత్వ రంగ సంస్థల కన్నా మిన్నగా పనితీరును కనబరుస్తూ అందరి దృష్టిని ఆకర్షిస్తోందన్నారు.
ముఖ్యంగా గత ఏడాదిన్నర కాలంలో కరోనా విపత్కర పరిస్థితులను అధిగమించి ఈ ఏడాది రికార్డు స్థాయిలో 68 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తిని, 400 మిలియన్ క్యూబిక్ మీటర్ల ఓవర్ బర్డెన్ తొలగింపు లక్ష్యాల సాధన దిశగా ముందుకెళ్తున్నామన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో లాభాలను సాధించనున్నట్లు తెలిపారు
కరీంనగర్ లో లోయర్ మానేరు ఢ్యాంలో ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ నిర్మాణాన్ని చేపడుతున్నామని, జియో థర్మల్ విద్యుత్ ఉత్పత్తికి శ్రీకారం చుట్టబోతున్నామని పేర్కొన్నారు. సింగరేణి లోని పని సంస్కృతి అద్భుతంగా ఉందని శ్రీధర్ ప్రశంసించారు.
సవాళ్లను ఎదుర్కోవడం, నిర్దేశిత లక్ష్యాల సాధనకు ప్రణాళికాబద్ధంగా పనిచేస్తారన్నారు. సింగరేణి డే సందర్భంగా సింగరేణి భవన్ లో అంకితభావంతో పనిచేస్తున్న ఎన్సీడబ్ల్యుఏ ఉద్యోగిని, అధికారిని ఈ సందర్భంగా సీఎండీ సన్మానించారు.
కార్యక్రమంలో అడ్వైజర్ (మైనింగ్) డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ (ఫారెస్ట్రీ) సురేంద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (కోల్ మూమెంట్) జె.ఆల్విన్, జీఎం(కో ఆర్డినేషన్) కె.సూర్యనారాయణ, జీఎం(మార్కెటింగ్) కె.రవిప్రసాద్, జీఎం(స్ట్రాటెజిక్ ప్లానింగ్) సురేందర్, సీఎంవోఏఐ జనరల్ సెక్రెటరీ ఎన్.వి.రాజశేఖర్, అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్ ఎన్.భాస్కర్, వివిధ విభాగాల అధిపతులు, అధికారులు, ఉద్యోగులు, సింగరేణి భవన్ సిబ్బంది పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
అనంతరం సింగరేణి డే సందర్భంగా కంపెనీ ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు అడ్మినిస్ట్రేటివ్ విభాగం ఆధ్వర్యంలో పలు విభాగాల్లోని పోటీల విజేతలకు జనరల్ మేనేజర్ (కో`ఆర్డినేషన్) శ్రీ కె.సూర్యనారాయణ బహుమతులు ప్రదానం చేశారు.