హైదరాబాద్, సెప్టెంబర్ 30 (నమస్తే తెలంగాణ): రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం, రిజర్వేషన్లపై లండన్లో నిర్వహించే సమావేశంలో కీలకోపన్యాసం చేయాలని ఎమ్మెల్సీ కవితకు ప్రముఖ స్వచ్ఛంద సంస్థ ‘బ్రిడ్జ్ ఇం డియా’ ఆహ్వానించింది. మహిళా బిల్లు కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసిన సందర్భంగా లండన్లో 6న సమావేశాన్ని ఏర్పాటు చేస్తున్నామని ఆ సంస్థ ఆహ్వా న పత్రంలో పేర్కొన్నది. దీనికి హాజరుకావాలని కోరింది. రాజకీయాలు, ప్రజాస్వామ్య ప్రక్రియలో మహిళల భాగస్వామ్యం పెరగడానికి కవిత కృషి చేశారని ప్రశంసించింది. మహిళా రిజర్వేషన్ బిల్లు కోసం అనేక ఆందోళనలు చేపట్టారని, వివిధ రాజకీయ పార్టీల మద్దతును కూడగట్టడం లో కీలక పాత్ర పోషించారని తెలిపింది.పలు రకాల కార్యక్రమాలతో దేశవ్యాప్తంగా మహిళా బిల్లుపై చర్చను రేకెత్తించారని పేరొన్నది. జంతర్మంతర్ వద్ద దాదాపు 6వేల మందితో ధర్నా చేశారని, ఈ కార్యక్రమానికి 18 పార్టీల నేతలు హాజ రై మద్దతు ప్రకటించారని తెలిపింది. మహిళా రిజర్వేషన్ల ఆవశ్యకతపై ఢిల్లీలో భారత జాగృతి జరిపిన సమావేశంలో 13 రాజకీయ పార్టీలతో పాటు మహి ళా, విద్యార్థి, రైతు సంఘాల నాయకులు పాల్గొన్నారని గుర్తు చేసింది.