మహబూబ్ నగర్ : తెలంగాణ రాష్ట్రంలో చేపట్టిన ప్రతిష్టాత్మక నిర్మాణపనులు రికార్డుస్థాయిల్లో పూర్తవుతున్నాయని రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక, క్రీడలు, యువజన సర్వీసులు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. జిల్లాలోని అప్పనపల్లి వద్ద నిర్మాణంలో ఉన్న రెండో బ్రిడ్జి పనులను సంబంధిత అధికారులతో కలిసి గురువారం పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ సమైక్య రాష్ట్రంలో ఒక్క బ్రిడ్జి నిర్మాణానికి 12 ఏళ్ల సమయం పట్టింది. ఇప్పుడు అక్కడే సమాంతరంగా నిర్మిస్తున్న రెండో బ్రిడ్జి నిర్మాణం పనులు కేవలం 12 నెలల్లో పూర్తి చేస్తున్నాం. వచ్చే ఏడాది జనవరి చివరి నాటికి పనులు పూర్తి చేసి ఫిబ్రవరిలో బ్రిడ్జి ప్రారంభానికి ఏర్పాట్లు చేయాలని ఆదేశించామని’ ఆయన వివరించారు. తెలంగాణకు ముందు కనీసం ఒక్క బ్రిడ్జి కూడా లేకపోవడంతో నిత్యం గంట గంటకోసారి రైల్వే గేటు పడడం వల్ల రాకపోకలకు తీవ్రంగా అంతరాయం ఏర్పడేదని మంత్రి తెలిపారు. అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ వెళ్లాలనుకునే వారి పరిస్థితి మరీ దయనీయంగా ఉండేదని గుర్తు చేశారు.
కేవలం ఏడాది కాలాన్ని లక్ష్యంగా నిర్దేశించుకుని రెండో బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించినట్లు తెలిపారు. రెండో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చిన తర్వాత మహబూబ్ నగర్ నుంచి హైదరాబాద్ వెళ్లేందుకు మొత్తం నాలుగు లైన్ల రహదారి అందుబాటులోకి వచ్చినట్లు అవుతుందని వెల్లడించారు. విమానాశ్రయానికి కేవలం గంట వ్యవధిలో ప్రయాణించే వెసులు బాటు కలుగుతుందని తెలిపారు.
డిసెంబర్ చివరి నాటికి బ్రిడ్జి పనులు మొత్తం పూర్తవుతుండగా రైల్వే శాఖ ఆధ్వర్యంలో నిర్మించాల్సిన స్లాబ్ గడ్డర్లు ఆలస్యం అవ్వడం వల్ల ఒక నెల రోజుల సమయం అదనంగా పడుతోందని అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఆయన వెంట మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్ కుమార్, జాతీయ రహదారుల విభాగం ఈఈ రమేశ్ కుమార్, ఏ ఈ వినోద్ కుమార్ తదితరులున్నారు.