Telangana | మరో నాలుగు రోజుల్లో పెండ్లి ఉందనగా వరుడు మిస్సయిన ఘటన విషాదంతంగా ముగిసింది. పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్లి కనిపించకుండా పోయిన పెండ్లి కొడుకు మృతదేహం ఎస్సారెస్పీ కెనాల్లో లభ్యమయ్యింది. దీంతో ఇరు కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వివరాల్లోకి వెళ్తే.. హనుమకొండలోని గోకుల్నగర్కు చెందిన కృష్ణ తేజ్ అనే యువకుడికి నర్సంపేటకు చెందిన యువతితో వివాహం నిశ్చయమైంది. వీరిద్దరికి ఈ నెల 16న వివాహానికి ముహూర్తం నిర్ణయించారు. ముహూర్తం దగ్గర పడుతుండటంతో ఇరు కుటుంబాలు పెండ్లి పనుల్లో నిమగ్నమయ్యాయి. ఈ క్రమంలో పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లిన కృష్ణ తేజ్ అదృశ్యం కావడంతో అందరూ ఆందోళన చెందారు. కృష్ణ తేజ్కు ఏమై ఉంటుందోనని ఊరంతా వెతికారు. కానీ ఎక్కడా కనిపించలేదు. ఎస్సారెస్పీ కెనాల్ పక్కన కృష్ణ తేజ్ బైక్ కనిపించడంతో కంగారు పడిపోయారు. ఎస్సారెస్పీ కెనాల్లో కృష్ణ తేజ్ పడిపోయి ఉంటాడనే అనుమానంతో కాకతీయ యూనివర్సిటీ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కృష్ణతేజ్కు ఏమీ కాకూడదని ఇరు కుటుంబాలు ప్రార్థించాయి. కానీ వాళ్ల ఆశలు ఆడియాశలే అయ్యాయి. కృష్ణ తేజ్ మృతదేహం కెనాల్లో లభ్యం కావడంతో కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. కాగా, కృష్ణ తేజ్ ఆత్మహత్య చేసుకున్నాడా? ఎవరైనా చంపేసి కెనాల్లో పడేసి ఉంటారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దీని వెనుక ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.