మణికొండ, సెప్టెంబర్ 14: ప్రేమ పెండ్లి చేసుకున్న నవవధువు పుట్టింటివారు మాట్లాడటం లేదని మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడింది. ఈ ఘటన హైదరాబాద్ నార్సింగి పోలీస్స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి చోటుచేసుకున్నది. వికారాబాద్ జిల్లా పరిగి మండలం నజీరాబాద్ తండాకు చెందిన కాట్రవత్ రేవతి (21) వరుసకు బావ అయిన రాహుల్ను ఏడు నెలల కిందట ప్రేమ వివాహం చేసుకున్నది. వీరు జీవనోపాధికోసం రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం జన్వాడ ఇందిరారెడ్డినగర్ కాలనీలో అద్దెకు ఉంటున్నారు. రాహుల్ పటాన్చెరువులో జేసీబీ డ్రైవర్గా పనిచేస్తుండగా, రేవతి ఇంటివద్దే ఉంటున్నది. నెల కిందట రేవతి గర్భం దాల్చింది. కానీ ఈ సంతోషాన్ని పంచుకునేందుకు తనవాళ్లు ఎవరూ పట్టించుకోవడంలేదని ప్రతి రోజూ బాధపడుతుండేంది. సోమవారం రాత్రి ఇంట్లో భర్త లేని సమయంలో రేవతి సీలింగ్ ఫ్యాన్కు ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. ఈ విషయమై కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేస్తుండగా, పోలీసుల ప్రాథమిక విచారణలో రేవతి మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడినట్టుగా భావిస్తున్నారు.