ఏటూరునాగారం, జనవరి 20: ఐటీడీఏలో ఇద్దరు ఇంజినీరింగ్ అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు దొరికారు. వరంగల్ ఏసీబీ డీఎస్పీ కే సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. 2022 మేడారం మహా జాతర సందర్భంగా ములుగుకు చెందిన కాంట్రాక్టర్ సంజీవతోపాటు మరో నలుగురు కలిసి రూ.16 లక్షల పెయింటింగ్ పనులు చేశారు. ఇందుకు సంబంధించిన బిల్లులు గత డిసెంబర్లో మంజూరయ్యాయి. రూ.16 లక్షల బిల్లు చెల్లించేందుకు ములుగు జిల్లా ఏటూరునాగారం ఐటీడీఏలోని గిరిజన సంక్షేమ శాఖ ఇంజినీరింగ్ విభాగం డీఈఈ నవీన్, ఏఈఈ ఎండీ అబీద్ఖాన్ రూ.90 వేలు లంచం డిమాండ్ చేశారు. ముందుగా రూ.50 వేలు, చెక్కు ఇచ్చిన తర్వాత రూ. 40 వేలు ఇచ్చేలా కాంట్రాక్టర్ సంజీవతో ఒప్పందం కుదుర్చుకున్నారు. శుక్రవారం రాత్రి ఐటీడీఏలో సంజీవ నుంచి ఏఈఈ అబీద్ఖాన్ రూ. 50 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. సదరు అధికారులు ఇద్దరిని అదుపులోకి తీసుకున్నామని ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపారు. అనంతరం గంటపాటు ఐటీడీఏ ఇంజినీరింగ్ సెక్షన్లోని డీఈఈ, ఏఈఈలకు సంబంధించిన గదులను తనిఖీ చేసి పలు రికార్డులను పరిశీలించినట్టు ఆయన పేర్కొన్నారు. ఈ క్రమంలో ఒకరిద్దరు ఉద్యోగులు భయపడి పరుగులు తీశారు.