Government Schools | హైదరాబాద్, మే 13 (నమస్తే తెలంగాణ) : పిల్లల్లో రక్తహీనత, పోషకాహార లోపాన్ని నివారించేందుకు సర్కారు బడుల్లో విద్యార్థులకు బ్రేక్ఫాస్ట్ అందజేయాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. వచ్చే విద్యాసంవత్సరం నుంచి దీనిని అమలు చేయాలని భావిస్తున్నారు. ఉదయం 10 నుంచి 11 గంటల సమయంలో విద్యార్థులకు బెల్లం, రాగిజావ కలిపిన బ్రేక్ఫాస్ట్ అందజేస్తారు. దీంతో పాటు ఉన్నత పాఠశాలల విద్యార్థులకు తృణధాన్యాల (మిల్లెట్స్)ను మధ్యాహ్న భోజనంలో చేర్చే అంశాన్ని పరిశీలిస్తున్నారు. బెల్లం పౌడర్, రాగి పిండిని బడులకు అందజేయనుండగా, మధ్యాహ్న భోజన పథకం కుక్ కమ్ హెల్పర్లు రాగిజావను తయారుచేసి విద్యార్థులకు అందజేస్తారు. మధ్యాహ్న భోజన పథకం మెనూలో వినూత్నంగా వారంలో ఒకరోజు వెజిటెబుల్ బిర్యానీని అమలు చేస్తున్నారు.
25 లక్షల మంది విద్యార్థులకు అమలు
మధ్యాహ్న భోజన పథకంలో భాగంగా రాష్ట్రంలోని 25 లక్షల పైచిలుకు విద్యార్థులకు ప్రొటీన్లు, విటమిన్లు, క్యాలరీలతో కూడిన ఆహారాన్ని సమకూరుస్తున్నారు. ఏటా 225 రోజులపాటు ఒకపూట భోజనాన్ని అందజేస్తున్నారు. ఇంకా ఎందరో చిన్నారులు ఐరన్లోపం, రక్తహీనత వంటి సమస్యలను ఎదుర్కొంటున్నారు. విద్యార్థుల్లో అత్యధికులు ఉదయం పూట ఏమీ తినకుండానే ఖాళీ కడుపుతో బడులకు హాజరవుతున్నారు. దీంతో వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతున్నది. ఈ నేపథ్యంలోనే ఒకటి నుంచి పదోతరగతి వరకు విద్యార్థుల ఆరోగ్యాన్ని కాపాడేందుకు వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ ఇవ్వాలని నిర్ణయించారు. బలవర్ధకమైన బెల్లం కలిపిన రాగిజావను అందించాలని ప్రాథమికంగా నిర్ణయించారు. ఇదివరకే రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని బడుల్లో స్వచ్ఛంద సంస్థలు, ట్రస్ట్ల సహకారంతో విద్యార్థులకు రాగిజావను అందజేస్తున్నారు. తాజా నిర్ణయం అమలైతే ప్రభుత్వమే పూర్తిస్థాయిలో బ్రేక్ఫాస్ట్ సమకూర్చనున్నది.
మెరుగైన మధ్యాహ్న భోజనం