హైదరాబాద్, ఫిబ్రవరి 2 (నమస్తే తెలంగాణ) : కేసీఆర్ సర్కార్ ప్రారంభించిన సీఎం బ్రేక్ఫాస్ట్ పథకాన్ని నిలిపివేసిన కాంగ్రెస్ సర్కార్.. అదే స్కీమ్ను మళ్లీ ప్రారంభించబోతున్నది. సర్కార్ బడుల్లో వచ్చే విద్యాసంవత్సరం నుంచి బ్రేక్ఫాస్ట్ స్కీమ్ను ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్ర బడ్జెట్లో బ్రేక్ఫాస్ట్ పథకాన్ని ప్రకటించనున్నది. అయితే కొత్త పేరు ఖరారుచేయనున్నట్టు తెలిసింది. ఈ స్కీమ్ కోసం బడ్జెట్లో రూ. 500కోట్లు కేటాయించనున్నట్టు సమాచారం. రాష్ట్రంలోని సర్కార్ బడుల్లో విద్యార్థులకు ఉదయాన్నే మంచి పౌష్టికాహారాన్ని అందించేందుకు సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని కేసీఆర్ సర్కార్ ప్రారంభించింది. 27,147 పాఠశాలల్లోని 23లక్షల మంది విద్యార్థులకు సమకూర్చే పథకానికి 2023 అక్టోబర్లోనే శ్రీకారం చుట్టింది. తొలుత నియోజకవర్గానికి ఒక స్కూల్ చొప్పున 119 స్కూళ్లల్లో పథకాన్ని ప్రారంభించగా, ఆ తర్వాత మండలానికి ఒక స్కూల్ చొప్పున ప్రారంభించారు. క్రమంగా మండలానికి రెండు, మూడు చొప్పున విస్తరించారు. 3,500కు పైగా స్కూళ్లకు అమలు చేశారు. అంతలోనే సర్కార్ మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం రావడంతో బ్రేక్ఫాస్ట్ బంద్ అయ్యింది.