యాదాద్రి: యాదాద్రి (Yadadri) శ్రీలక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా స్వామివారు శ్రీమహావిష్ణు అలంకారంలో దర్శనమివ్వనున్నారు. లక్ష్మీసమేత నారసింహుడు నేడు గురుడ వాహనంపై ఊరేగనున్నాడు. రాత్రి 7 గంటలకు బాలాలయంలో నిర్వహించే రథోత్సవంలో స్వర్ణరథంపై స్వామి, అమ్మవార్లు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
బ్రహ్మోత్సవాల్లో ప్రధాన ఘట్టమైన స్వామివారి కల్యాణం శుక్రవారం నేత్రపర్వంగా సాగింది. రక్షాబంధనం, యజ్ఞోపవీతధారణ, జీలకర్ర బెల్లం తంతుతో యాదాద్రి క్షేత్రంలో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీలక్ష్మీనరసింహస్వామి తిరుకల్యాణ మహోత్సవం కన్నుల పండువగా జరిగింది. బాలాలయంలో వైభవోపేతంగా జరిగిన కల్యాణ వేడుకలను కనులారా వీక్షించి భక్తజనం పులకించింది.
స్వామివారిని శ్రీరామ అలంకారంలో సేవించి హనుమద్వాహనం, గజవాహనంపై ఊరేగించిన అనంతరం తిరుకల్యాణ మహోత్సవ ఘట్టాన్ని ప్రారంభించారు. అభిజిత్ లగ్న సుముహూర్తాన ఉదయం 11 గంటలకు ఆగమశాస్త్రం ప్రకారం రెండు గంటలపాటు వైభవోపేతంగా నిర్వహించారు