Prakash Ambedkar | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఏప్రిల్ 12 (నమస్తే తెలంగాణ): భారత రాజ్యాంగ నిర్మాత, సామాజిక తత్వవేత్త డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మహా విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నట్టు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ యశ్వంత్ అంబేద్కర్ తెలిపారు. హైదరాబాద్ నగర నడిబొడ్డున ఏర్పాటు చేస్తున్న దేశంలోనే అతిపెద్ద అంబేద్కర్ మహా విగ్రహావిష్కరణ ఘట్టం చరిత్రలో సువర్ణాధ్యాయమని అభివర్ణించారు. అంబేద్కర్ ఆశయాలకు, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ప్రతీకగా తెలంగాణ నూతన సచివాలయం నిర్మాణం అత్యంత శోభాయమానంగా జరుగుతున్నదని కొనియాడారు. తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టాలని సీఎం కే చంద్రశేఖర్రావు తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నట్టు తెలిపారు. దళితుల అభ్యున్నతికి కేసీఆర్ సర్కారు ప్రవేశపెట్టిన పలు సంక్షేమ పథకాలు, కార్యక్రమాలను ప్రత్యేకంగా ప్రశంసించారు. ఈ మేరకు మంగళవారం ‘నమస్తే తెలంగాణ’కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ వివరాలు..
నిజమే. అంబేద్కర్ మహావిగ్రహం ఏర్పాటు చేయాలన్న నిర్ణయమే సాహసోపేతమైనది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంతో పాటు దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా తీసుకోని గొప్ప నిర్ణయాన్ని కేసీఆర్ సర్కారు తీసుకొన్నది. ఆచరణలో కూడా చేసి చూపించింది. ఆర్థికంగా, సామాజికంగా అట్టడుగున నిలిచి వివక్షకు గురైన దళిత సమాజోద్ధరణకు అంబేద్కర్ సాగించిన కృషిని భవిష్యత్తు తరాలు గుర్తుంచుకొనేలా ఆయనకు 125 అడుగుల మహా విగ్రహాన్ని నిర్మించతలపెట్టడం గొప్ప విషయం. ఈ నిర్ణయంతో కేసీఆర్ దళిత పక్షపాతి అనే విషయం మరోసారి రుజువైంది.
అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు రాజకీయ నిర్ణయం కాదని నమ్ముతున్నా. కేసీఆర్ అంతరంగంలో నుంచి వచ్చిన భావోద్వేగ సంకల్పానికి ప్రతీకే ఈ మహావిగ్రహం అని భావిస్తున్నా. అంతేకాదు, కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం, ఆ భవనం సమీపంలోనే మహా విగ్రహాన్ని నిర్మించడం.. అంబేద్కర్ చరిత్రను భవిష్యత్తు తరాలకు అందించాలన్న మహోన్నత ఆశయంలో భాగమేనని కచ్చితంగా చెప్పగలను.
కొత్తగా నిర్మిస్తున్న తెలంగాణ రాష్ట్ర సచివాలయానికి అంబేద్కర్ పేరు పెడుతూ కేసీఆర్ తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా. తెలంగాణ రాష్ట్ర పరిపాలనకు, నాలుగు కోట్ల మంది ప్రజల సంక్షేమానికి సంబంధించి నిర్ణయాలు తీసుకొనే కీలక భవనానికి అంబేద్కర్ పేరు పెట్టడం సముచితమే కాదు గొప్ప నిర్ణయం కూడా. కొత్త సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతోపాటు దేశంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసి బాబాసాహెబ్కు కేసీఆర్ మహా గౌరవాన్ని కల్పించారు. కేసీఆర్ నిర్ణయాన్ని ఇప్పుడు యావత్తు దేశం అభినందిస్తున్నది. అంబేద్కర్ కేవలం ఒక కులానికో, మతానికో పరిమితమైన వ్యక్తి కాదు. దేశంలోని 140 కోట్ల మంది ఆత్మగౌరవానికి ప్రతీక.
దళితుల సంక్షేమం కోసం గడిచిన ఎనిమిదేండ్లలో తెలంగాణ ప్రభుత్వం దాదాపు రూ.70 వేల కోట్ల వరకు ఖర్చు చేసినట్టు తెలుసుకొన్నా. కొత్తగా ఏర్పడిన తెలంగాణ వంటి చిన్న రాష్ట్రంలో దళితుల కోసం ఇంతపెద్ద మొత్తంలో ఖర్చు చేయడం మామూలు విషయం కాదు. గొప్ప ఆశయంతోపాటు మంచి మనసు ఉంటేనే ఇది సాధ్యపడుతుంది. ఆర్థికంగా, విద్యాపరంగా, సామాజికంగా, రాజకీయంగా ఇలా ఏ కోణంలో చూసినప్పటికీ.. దళితుల అభ్యున్నతికి కేసీఆర్ అమిత ప్రాధాన్యం ఇస్తున్నట్టు దీంతో రూఢీ అయ్యింది. దళితబంధు, డాక్టర్ అంబేద్కర్ విద్యానిధి పథకం, దళితవాడలకు ఉచిత విద్యుత్తు కనెక్షన్లు, ప్రీమెట్రిక్ ఆర్థిక సాయం, పోస్ట్మెట్రిక్ స్కాలర్షిప్స్, ఎస్సీ హాస్టళ్లు, స్వయం ఉపాధికి ఆర్థిక ప్రోత్సాహం, ఎస్సీ స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్ ఇలా.. దళితుల కోసం తెలంగాణ సర్కారు తీసుకొచ్చిన ప్రతీ పథకం ఇతర రాష్ర్టాలకు అనుసరణీయమే.
ఎంతో ఆత్రుతతో ఉన్నా. హైదరాబాద్ నడిబొడ్డున, హుస్సేన్సాగర్ తీరంలో శిఖరమంత ఎత్తున కొలువుదీరిన అంబేద్కర్ మహా విగ్రహాన్ని ప్రత్యక్షంగా చూసేందుకు ఉత్సాహంగా ఉన్నా. కొత్త సచివాలయానికి వచ్చే నాయకులనే కాదు.. స్థానికులను, వివిధ పనుల కోసం నగరానికి వచ్చే లక్షలాది మందిని అనునిత్యం చైతన్యపరుస్తూ.. పాలనావ్యవస్థకు దిక్సూచిలా అంబేద్కర్ మహా విగ్రహాన్ని నిర్మించారు. ఇది శుభపరిణామం.
ఆధునిక అవసరాలకు, ఆర్థిక సంక్షోభ నివారణకు ‘ప్రాబ్లం ఆఫ్ రుపీ’ పేరిట అంబేద్కర్ ఎంతో ముందుచూపుతో ఓ గ్రంథాన్ని రచించారు. ఆర్థిక ఒడిదుడుకులను ఎదుర్కోవడానికి ఎంతగానో ఉపయోగపడేలా ఉన్న ఈ పుస్తకానికి వేలం నిర్వహిద్దామంటూ ఇటీవల ఢిల్లీ వసంత్ చేసిన ప్రతిపాదన.. దానికి వచ్చిన స్పందన గురించి తెలుసుకొన్నా. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. పెరిగిన ధరలతో ప్రస్తుతం దేశంలో సామాన్యులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డాలర్తో రూపాయి మారకం విలువ అంతకంతకూ పతనమవుతున్నది. రూపాయి స్థిరత్వం, బలోపేతానికి సంబంధించి ఎన్నో గొప్ప సలహాలు, సూచనలను ‘ప్రాబ్లం ఆఫ్ రుపీ’ గ్రంథంలో అంబేద్కర్ ప్రత్యేకంగా ప్రస్తావించారు. ప్రపంచ దేశాలను ఆర్థికమాంద్యం భయాలు చుట్టుముడుతున్న ప్రస్తుత తరుణంలో ‘ప్రాబ్లం ఆఫ్ రుపీ’ కాన్సెప్ట్పై మరింత పెద్దయెత్తున చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నది.