హైదరాబాద్, మార్చి 19 (నమస్తే తెలంగాణ): హిందూ మతోన్మాదాన్ని, జాతీయోన్మాదాన్ని, యుద్ధోన్మాదాన్ని రెచ్చగొట్టి ప్రజల ఓట్లను దండుకునేందుకు బీజేపీ సిద్ధంగా ఉన్నదని మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ పేర్కొన్నది. బ్రాహ్మణీయ, ఫాసిస్టు ప్రమాదం నుంచి దేశాన్ని రక్షించేందుకు ప్రజలు లోక్సభ ఎన్నికలను బహిష్కరించాలని పిలుపునిస్తూ ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జగన్ మంగళవారం ఓ లేఖను విడుదల చేశారు.
ఎన్నికల్లో గెలిచేందుకు ఆర్ఎస్ఎస్, బీజేపీ దుర్మార్గపు పన్నాగం పన్నాయని తెలిపారు. ఎన్నికల కమిషన్ను కీలుబొమ్మగా మార్చేందుకు కుట్రలు చేస్తున్నారని తెలిపారు. మోదీ పరిపాలనలో నిరంకుశత్వ హిందుత్వ రాష్ర్టాన్ని స్థాపించే లక్ష్యంతో బ్రాహ్మణీయ హిందుత్వ ఫాసిజాన్ని అమలు చేస్తున్నాని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యాధికారాన్ని సాధించుకోవడానికి ప్రజలు నూతన ప్రజాస్వామిక విప్లవంలో భాగస్వామం కావాలని పిలుపునిచ్చారు.