బంజారాహిల్స్, మార్చి 15: ‘నీ బిల్డింగ్పై ఇల్లీగల్గా ఫ్లోర్ వేస్తున్నావని మీడియా వాళ్లు కైంప్లెంట్ ఇచ్చారు. వెంటనే సెటిల్ చేసుకో’ అంటూ ఓ బిల్డర్కు జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్ప్లానింగ్ సెక్షన్ అధికారి వార్నింగ్ ఇచ్చాడు. అనంతరం ‘రూ.కోటి ఇచ్చేసేయ్.. జీహెచ్ఎంసీ అధికారులను, మీడియా వాళ్లను మేనేజ్ చేస్తా’ అంటూ ఓ విలేకరి బేరం మొదలు పెట్టాడు. వీటిని భరించలేక ఆ బిల్డర్ పోలీసులను ఆశ్రయించడంతో వారిద్దరిపై క్రిమినల్ కేసు నమోదైంది. వివరాల్లోకెళ్తే.. జూబ్లీహిల్స్ రోడ్డు నంబర్ 10లో ప్రసాద్ అనే బిల్డర్ భవనాన్ని నిర్మిస్తున్నాడు. ఆ భవనంపై అదనపు అంతస్తు నిర్మిస్తున్నట్లు సమాచారం అందుకున్న జీహెచ్ఎంసీ సర్కిల్-18 టౌన్ ప్లానింగ్ సెక్షన్ అధికారి విశాల్ ఇటీవల అక్కడకు వెళ్లి పరిశీలించాడు. ఆ అదనపు అంతస్తు గురించి ఆకుల కిరణ్గౌడ్ అనే విలేకరికి చెప్పాడు. అప్పటి నుంచి కిరణ్గౌడ్ జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు చేయడం ప్రారంభించాడు. దీంతో విశాల్ ఆ బిల్డర్ను పిలిపించి కిరణ్గౌడ్ను పరిచయం చేశాడు. ‘మీరు అదనపు అంతస్తు నిర్మిస్తున్నట్టు ఫిర్యాదులు చేస్తున్నది ఇతనే. కిరణ్గౌడ్తోపాటు మీడియాను మేనేజ్ చేసుకోకుంటే మీ భవనాన్ని కూల్చివేయాల్సి ఉంటుంది’ అంటూ విశాల్ హెచ్చరించాడు.
అనంతరం ఈ వ్యవహారాన్ని సరిచేస్తానని, ఫిర్యాదులను వెనక్కి తీసుకోవడంతోపాటు జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ అధికారులను, మీడియాను మేనేజ్ చేస్తానని ప్రసాద్తో కిరణ్గౌడ్ బేరం మొదలుపెట్టాడు. ఈ మొత్తం వ్యవహారానికి రూ.1.20 కోట్లు ఖర్చవుతుందని, తనతోపాటు చాలామంది విలేకరులు ఉన్నారని పేర్కొంటూ.. వారి జాబితాను చూపించాడు. దీంతో అవాక్కయిన ప్రసాద్.. వారం రోజుల్లో చెప్తానంటూ వచ్చేశాడు. ఆ తర్వాత కూడా కిరణ్గౌడ్ బెదిరింపులు ఆగకపోవడం, పలువురు వ్యక్తులను సైట్ వద్దకు పంపి వీడియోలు తీయిస్తుండంతో విసిగిపోయిన ప్రసాద్ గురువారం రాత్రి జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో కిరణ్గౌడ్, విశాల్తోపాటు వారికి సహకరించిన ఇతరులపై ఐపీసీ 384, 506, 120(బీ) సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదైంది. ప్రస్తుతం వారిద్దరినీ పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.