అదానీ వ్యవహారంపై సంయుక్త పార్లమెంటరీ కమిటీని వేయాలంటూ పట్టుబడుతున్న విపక్షం.. బుధవారం నిరసనను మరింత పెంచింది. పార్లమెంటులో గంటన్నరసేపు మాట్లాడిన ప్రధాని మోదీ.. అదానీ వ్యవహారంపై మాత్రం పెదవి విప్పకపోవడంపై బీఆర్ఎస్ మండిపడింది.
హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): ‘అదానీ-హిండెన్బర్గ్ నివేదిక’ అంశంపై పార్లమెంట్ ఉభయసభలు బుధవారం కూడా అట్టుడికాయి. అదానీ వ్యవహారంపై పార్లమెంట్లో చర్చించాలని, సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) చేత విచారణ చేయించి వాస్తవాలు నిగ్గుతేల్చాల్సిందేనని బీఆర్ఎస్తో పాటు పలు విపక్ష పార్టీల ఎంపీలు డిమాండ్ చేశారు. చర్చకు సభాపతులు అనుమతించకపోవడంతో బీఆర్ఎస్తో పాటు ఆప్, శివసేన ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. అదానీ అంశాన్ని తేల్చాల్సిందేనంటూ లోక్సభలో ప్రధాని మోదీ ప్రసంగాన్ని బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వరరావు పార్టీ ఎంపీలతో కలసి అడ్డుకొన్నారు. కీలకమైన అదానీ-హిండెన్బర్గ్ నివేదిక అంశంపై సభలో చర్చించాలని, జేపీసీ నియమించాలని ప్రధానిని డిమాండ్ చేశారు. స్పీకర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నామా పార్టీ ఎంపీలతో కలసి సభ నుంచి వాకౌట్ చేశారు.
అదానీ అంశంపై చర్చకు లోక్సభ, రాజ్యసభల్లో బీఆర్ఎస్ నోటీసులు అందజేసింది. చర్చకు కేంద్రం నిరాకరించడంతో బీఆర్ఎస్ ఎంపీలు ఆందోళన చేశారు. వాకౌట్ అనంతరం పార్లమెంట్ ఆవరణలోని గాంధీ విగ్రహం ఎదుట ప్లకార్డులతో నిరసన తెలిపారు. నిరసనలో బీఆర్ఎస్ ఎంపీలకు ఆప్, శివసేన ఎంపీలు జత కలిశారు.
140 కోట్ల మంది ప్రజల నమ్మకాన్ని తాను రక్షణ కవచంగా ధరించానని, అబద్ధాలు, ఆరోపణలు, దూషణలు దానికి భంగం కలిగించలేవని ప్రధాని మోదీ అన్నారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఆయన లోక్సభలో మాట్లాడారు. అయితే అదానీ వ్యవహారంపై విపక్షాల ప్రశ్నలకు సమాధాన మివ్వకుండా విమర్శలకే పరిమితమయ్యారు.
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు మాట్లాడుతూ అదానీ వ్యవహారంపై ఉభయ సభల్లో చర్చకు అనుమతించాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రభుత్వ వైఖరి సరిగాలేదన్నారు. ఈ విషయంలో కేంద్రం ఉద్దేశపూర్వకంగానే వెనుకడుగు వేస్తుందని ఎంపీ నామా నాగేశ్వరరావు దుయ్యబట్టారు. అదానీ అంశంపై చర్చ జరిపేంత వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తాము ప్రజా ప్రతినిధులమని, ప్రజలకు నష్టం జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తమపై ఉన్నదని పేర్కొన్నారు.