అయిజ రూరల్, మార్చి 19 : బోరు కోసం చందాలు వేసుకొన్న మొత్తాన్ని అధికారులు వాపస్ చేశారు. జోగుళాంబ గద్వాల జిల్లా అయిజ మండలం సంకాపురంలో నాలుగు రోజులుగా నీటి ఎద్దడి నెలకొన్నది. అధికారులకు విషయం చెప్పినా పట్టించుకోవడం లేదని ఇంటికి రూ.200 చొప్పున బోరు మోటరు మరమ్మతుకు స్థానికులు విరాళాలు సేకరించారు. ఈ విషయమై మంగళవారం ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో ‘బోరు కోసం.. ఊరు విరాళం’ అన్న శీర్షీకన కథనం ప్రచురితమైంది.
దీంతో జిల్లా ఆర్డబ్ల్యూఎస్, మిషన్ భగీరథ అధికారులు గ్రామంలో పర్యటించి తాగునీటి ఇబ్బందుల గురించి ఆరా తీశారు. ఈ సమయంలో అధికారులకు, గ్రామస్థులకు మధ్య కొద్దిసేపు వాగ్వాదం చోటుచేసుకున్నది. పైపులైన్ మరమ్మతు పనులు త్వరలో పూర్తి చేయించడంతోపాటు తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో స్థానికులు శాంతించారు. గ్రామస్థులు సోమవారం మోటర్ కోసం పోగు చేసుకున్న రూ.26 వేలను అధికారులు తిరిగి చెల్లించారు.